యూట‌ర్న్ పాలిటిక్స్‌.. ఆళ్లదా.. జ‌గ‌న్‌దా?

రాజకీయాల్లో శాశ్వ‌త శ‌త్ర‌వులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌రని అంటారు. అవ‌స‌రం.. అవ‌కాశం అనే రెండు ప‌ట్టాల‌పైనేరాజ‌కీయ రైలు ప‌ర‌గులు పెడుతుంది. అది పార్టీ అయినా.. నాయ‌కులైనా ఫార్ములా అయితే ఒక్క‌టే. ఇప్పుడు ఇదే ఫార్ములా వైసీపీలోనూ క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా మంగ‌ళగిరి ఎమ్మెల్యే, కొన్నాళ్ల కింద‌ట వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ క్ర‌మంలో ఆళ్ల‌తో హైద‌రాబాద్‌లో వైసీపీ కీల‌క నాయకుడు, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చ‌ర్చ‌లు జ‌రిపినట్టు తెలిసింది. మ‌ళ్లీ వైసీపీలోకి రావాల‌ని ఆహ్వానించిన‌ట్టు స‌మాచారం. అయితే.. దీనిపై అధికారికంగా ఇంకా స‌మాచారం రావాల్సి ఉంది. అయితే..అ నూహ్యంగా ఆళ్ల వైసీపీ నేత‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ఆస‌క్తిగా మారింది. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న వెంట‌నే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ష‌ర్మిల వెంట నడుస్తాన‌ని చెప్పారు. న‌డిచారు కూడా. అయితే.. ఇప్పుడు ఆక‌స్మికంగా యూట‌ర్న్ తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఆళ్ల‌ కోణంలో..

ఆళ్ల కోణంలో చూస్తే.. ఆయ‌న రాజ‌కీయం అంతా కూడా.. వైసీపీ వ‌ల‌న‌, వైసీపీ చేత అన్న‌ట్టుగా న‌డిచింది. వ్య‌క్తిగ‌తంగా కంటే కూడా.. సీఎంజ‌గ‌న్ ఫొటోతోనే ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్పైనే విజయం సాధించారు. అలాంటినాయ‌కుడు ఇప్ప‌డు ఒంట‌రిగా పోరాటం చేసినా.. ఫ‌లితం క‌నిపించ‌ద‌నే వాద‌న ఉంది. అదేస‌మ‌యంలో వైసీపీ వంటిబ‌ల‌మైన పార్టీని వీడితే.. నియోజ‌క‌వ‌ర్గంలో డౌన్ అవుతున్న ప‌రిస్థితి ఆయ‌న‌కు క‌నిపిస్తోంది. ఇక‌, కాంగ్రెస్ పుంజుకుంటుంద‌ని అనుకున్నా.. ఇప్ప‌ట్లో ఆ దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. దీంతో ఆళ్ల వైసీపీవైపు మొగ్గు చూపుతున్నార‌నే చ‌ర్చ ఉంది.

వైసీపీ కోణంలో..

వైసీపీకోణంలో చూస్తే.. ఆళ్ల వంటి విశ్వ‌స‌నీయ నాయ‌కుడు గుంటూరు జిల్లాలో క‌నిపించ‌రు. సీఎం జ‌గ‌న్ కు అంత్యంత విధేయుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. ఏ విష‌యంపైనైనా ఆయ‌న లోతైన విశ్లేష‌ణ చేయ‌గ‌ల స‌మ‌ర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఇలాంటి నాయ‌కుడిని విడిచి పెట్ట‌డంపార్టీకి విఘాత మ‌నే వాద‌న ఉంది. ఈ నేప‌థ్యానికి తోడు మంగ‌ళ‌గిరిలో వైసీపీ చేసిన ఎంపిక‌లు కూడా బ‌లంగా లేవు. ముందు గంజి చిరంజీవిని బ‌ల‌మైన నాయ‌కుడు అనుకున్న‌.. అంత ఊపుఇప్పుడు క‌నిపించ‌డం లేదు. దీంతో కొంత కిందికి దిగినా..ఆళ్ల‌వైపే మొగ్గు చూప‌డం ద్వారా.. నారా లోకేష్‌కు చెక్ పెట్టాల‌నేది వైసీపీ కోణంగా క‌నిపిస్తోంది. దీంతో ఇరు ప‌క్షాలు రాజీ ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది.