రేవంత్ ప్రభుత్వం  టార్గెట్ రీచయ్యిందా ?

తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నదానికన్నా చక్కగానే ఉపయోగించుకున్నది. అసెంబ్లీ సమావేశాల్లో వ్యక్తిగతంగా కేసీయార్, హరీష్ రావును ఇరుకునపెట్టడమే టార్గెట్ గా రేవంత్ అండ్ కో పావులు కదిపింది. ఇందుకు కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీలను అస్త్రాలుగా ఉపయోగించుకోవాలని అనుకున్నది. అనుకున్నట్లే సమావేశాల్లో కేసీయార్, హరీష్ పైన పదేపదే ఆరోపణలు చేసింది. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని, మేడిగడ్డ బ్యారేజి నాసిరకం నిర్మాణం వల్ల ఎందుకు పనికిరాకుండా పోతోందనే విషయాన్ని జనాల్లోకి రేవంత్, మంత్రలు చాలా బలంగా పంపించగలిగారు. హోల్ మొత్తంమీద కేసీయార్, హరీష్ భారీ అవినీతికి పాల్పడ్డారనే అంశాన్ని జనాల్లోకి పంపించగలిగారు.

వేలకోట్ల రూపాయలు కేసీయార్ కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డంపెట్టుకుని దోచుకున్నట్లు రేవంత్, మంత్రులు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను కేసీయార్ అండ్ కో సరిగా తిప్పికొట్టలేకపోయారు. పైగా వాళ్ళు చేసిన అడ్డుగోలు వాదనలతో భారీ అవినీతి జరిగింది నిజమే అని జనాలు అనుకోవడం మొదలుపెట్టారు. తాము ఏ తప్పుచేయలేదని భయపడాల్సిన అవసరం లేదని మాత్రమే హరీష్ రావు అసెంబ్లీలో పదేపదే చెప్పారు. మరిదే నిజమైతే వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా జరిగిందన్న కాగ్ రిపోర్టును ఏమంటారు ? అన్నది రేవంత్ ప్రశ్న.

అలాగే రాజకీయ లబ్దికోసమే మేడిగడ్డ బ్యారేజిని పునరుద్ధరించలేదని హరీష్ ఎదురుదాడి తనను తాను రక్షించుకోవటం కోసమే అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. మేడిగడ్డను రేవంత్ ప్రభుత్వం పునరుద్ధరించలేదని స్వయంగా హరీషే అన్నారు. అంటే తమ హయాంలో మేడిగడ్డ బ్యారేజి దెబ్బతిన్నదని అంగీకరించటమే కదా. కాళేశ్వరం, మేడిగడ్డతో పాటు మరికొన్ని నిర్మాణమైంది కేసీయార్ పాలనలోని పదేళ్ళల్లోనే కదా. అంటే అందులో బయటపడుతున్న అవినీతి, అక్రమాలకు బాధ్యత వహించాల్సింది కూడా కేసీయార్, హరీషే అని రేవంత్, మంత్రులు ధాటిగా చెబుతున్నారు.

అందుకనే కాళేశ్వరం కళంకమంతా మామా, అల్లుళ్ళదే అని కేసీయార్, హరీష్ ను ఉద్దేశించి అసెంబ్లీలో రేవంత్ చెప్పింది. ఇంకా విచిత్రం ఏమిటంటే నల్గొండ సభలో కేసీయార్ మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజిలో ఒక పిల్లర్ కుంగితే ఏమవుతుంది ? అని ప్రశ్నించటం ఆశ్చర్యంగా ఉంది. అసలు ఒక్క పిల్లరైనా  ఎందుకు కుంగాలి అన్న ప్రశ్న జనాల్లో మొదలైంది. నిజానికి కుంగింది ఒక్క పిల్లర్ కాదు నాలుగు పిల్లర్లు. వర్షాలు, వరదలు లేనపుడే నాలుగు పిల్లర్లు కుంగితే భారీ వర్షాలు, వరదలు వస్తే బ్యారేజి కొట్టుకుపోకుండా ఉంటుందా అనే చర్చ జనాల్లో పెరిగిపోతోంది. మరి దీనికి కేసీయార్ ఏమి సమాధానం చెబుతారో చూడాలి.