బీఆర్ఎస్ పై మరో మరక

మొత్తం తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు తేల్చిందేమిటంటే అన్నారం ప్రాజెక్టు పనికిరాదని. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ చేసి సాగు నీటికి అందించే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా తేల్చిచెప్పేశారు. ఒకవైపు మేడిగడ్డ బ్యారేజిలోని నాణ్యత లోపాలు, నాసిరకం నిర్మాణమనే ఆరోపణలపై ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరుగుతోంది. ఈ విషయం ఎలాగుండగానే అన్నారం ప్రాజెక్టులో లీకేజీలు మొదలై పెరిగిపోతున్నాయి. ఒకవైపు అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై వాడి వేడి చర్చలు జరుగుతున్న సమయంలోనే శనివారం మధ్యాహ్నం అన్నారం ప్రాజెక్టులో లీకేజీలు మొదలయ్యాయి.

ప్రాజెక్టులో నుండి నీళ్ళు లీకేజీల ద్వారా బయటకు వచ్చేస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. పిల్లర్ ఫౌండేషన్ కింద నుండి నీరు భారీగా బయటకు వచ్చేస్తోంది. దాంతో ప్రాజెక్టు గేట్లు కొట్టుకుని పోకుండా అధికారులే మెల్లిగా గేట్లను ఎత్తేస్తున్నారు. పోయిన ఏడాది కూడా అన్నారం ప్రాజెక్టులో లీకేజీలు మొదలైతే అధికారులు రిపేర్లు చేశారు.అలాంటిది ఇపుడు మళ్ళీ లీకేజీలు మొదలవ్వటంతో ఏమిచేయాలో అర్ధంకావటం లేదు.

ఒక ప్రాజెక్టు తర్వాత ప్రాజెక్టులో అవినీతి, నాసిరకం నిర్మాణాలు బయటపడుతున్నా తమకేమీ సంబంధం లేదని కేసీయార్, హరీష్ రావు సమర్ధించుకుంటన్నట్లు రేవంత్, మంత్రులు ఫుల్లుగా వాయించేశారు. పదేళ్ళ పాలనలో నాసిరకం నిర్మాణాలు కట్టి వేల కోట్లరూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న కేసీయార్, హరీష్ కు సంబంధంలేకపోతే రెండునెలల క్రితమే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలా ? అని రేవంత్ సూటిగా ప్రశ్నించారు. అన్నారం ప్రాజెక్టులోని పిల్లర్ 35 కిందనుండి నీరు భారీగా లీకేజీ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు.

నీటి నిల్వ ఉన్నపుడు గేట్లు లేకపోతే ఇతర రిపేర్లు సాధ్యం కాదు కాబట్టి ప్రాజెక్టులోని నీటినంతా అధికారులు దిగువ ప్రాంతాలకు వదిలేస్తున్నారు. దాదాపు 13 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో నుండి బయటకు వచ్చేస్తోంది. ప్రాజెక్టులో నుండి నీటిని పూర్తిగా ఖాళీచేస్తే కాని పిల్లర్లు 35, 36 అడుగుభాగాలను పరిశీలించేందుకు వీలవుతుంది. ఇదే విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ కో మాట్లాడుతు సాగునీటి ప్రాజెక్టులుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ పనికిరావని నిపుణులు తేల్చిన విషయాన్ని అసెంబ్లీలోనే ప్రకటించారు. వర్షాలు, తుపానులు లేనపుడే ప్రాజెక్టుల నిర్మాణం ఇంతగా బలహీనమైపోతే ఇక వర్షాలు పడితే ఏమి జరుగుతుందో చెప్పలేకపోతున్నారు. మరి రాబోయే వేసవిలో సాగు, తాగు నీటికి పై ప్రాజెక్టుల పరిధిలోని జనాలు ఏమిచేయాలో ?