ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలుగులోనే కాదు హిందీలోనూ పెద్ద బ్రాండ్. శివ నుంచి సర్కార్ దాకా ఎన్నో మాస్టర్ క్లాసిక్స్ ఇచ్చిన ఈ మాస్టర్ మైండ్ గత కొన్నేళ్లుగా ఎలాంటి కళాఖండాలు తీస్తున్నారో చెప్పనక్కర్లేదు. నిర్మాతగానూ వర్మకు ప్రత్యేక గౌరవముండేది. అది కూడా క్రమంగా కనుమరుగవడం మొదలయ్యింది. ఇటీవలే సత్య రీ రిలీజ్ టైంలో తాను ఫిలిం మేకర్ గా ఏం కోల్పోతున్నానో, ఎలాంటి తప్పులు చేస్తున్నానో అర్థమవుతోందని, ఇకపై మంచి సినిమాలు తీసేందుకు కష్టపడతానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కట్ చేస్తే నాలుగైదు వారాలు తిరగడం ఆలస్యం ఆయన ప్రొడక్షన్లో రూపొందిన శారీ నిన్న రిలీజయ్యింది.
ఊహించినట్టే వర్మ మళ్ళీ మాట తప్పేశారు. ఆన్ లైన్ ఉచ్చులో పడితే ఎలాంటి ముప్పు తలెత్తుందో చెప్పే సందేశంతో కథ రాసుకున్నారు. దాన్ని తనకు అలవాటైన రీతిలో భరించలేని ప్రహసనంగా మార్చడంతో దర్శకత్వం వహించింది గిరి కృష్ణ కమలే అయినా వర్మ మార్కు పైత్యంతో శారీకి ప్రేక్షకులు సారీ అనేలా చేశారు. కథేంటంటే ఒంటరైన ఆరాధ్య దేవి (ఆరాధ్య) కు సోషల్ మీడియా ద్వారా కిట్టు (సత్య యుదు) తో పరిచయమవుతాడు. వెంటపడి ఫోటోలు తీస్తూ ఇష్టపడుతున్నట్టు మొదలైన స్నేహం క్రమంగా అతన్ని శాడిస్ట్ గా మార్చి ఏకంగా ఫామిలీ మొత్తాన్ని బెదిరించే స్థాయికి తీసుకెళ్తుంది. తర్వాత జరిగేది చూసి తరించాల్సిందే.
బోల్డ్, న్యాచురల్, డెప్త్ లాంటి పదాలు వినేందుకే బాగుంటాయి. వాటిని సరైన మోతాదులో వాడితేనే తెరమీద పండుతాయి. కానీ వర్మ వీటిని ఎక్స్ ట్రీమ్ (మితిమీరి) స్థాయికి తీసుకెళ్లడం వల్ల శారీ మొదటి నుంచి చివరి దాకా భరించలేని తలనెప్పిగా మారుతుంది. కిట్టు చేష్టలు, ఆరాధ్య గ్లామర్ షో చాలా ఓవర్ గా చూపించారు. ఒకదశ దాటాక వీటిని భరిస్తూ థియేటర్లో కూర్చోవడం కష్టమనిపించే స్థాయిలో ఇవి భయపెడతాయి. రెండు గంటల నిడివి నాలుగు గంటలు అనిపిస్తుంది. టికెట్లు కొని వచ్చినోళ్ళు నమ్మి వచ్చినందుకు తమకు తాము సారీ చెప్పుకునే స్థాయిలో ఉన్న ఈ శారీని కనీసం ఓటిటి రికమండేషన్ కూడా చేయలేం.