తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ రజతోత్సవాలకు రెడీ అయింది. ఈ నెల 27వ తేదీకి బీఆర్ ఎస్(అప్పటి టీఆర్ ఎస్) పెట్టి.. 25 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాలను అంగరంగా వైభవంగా నిర్వహించాలని పార్టీ భావించిం ది. పోరాటాల పురిటి గడ్డ వరంగల్లును వేదికగా నిర్ణయించుకుంది. 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత.. 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. పార్టీ శ్రేణులు డీలా పడిన విషయం తెలిసిందే. ఇక, జంపింగుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఈ నేపథ్యంలో పార్టీని మళ్లీ పుంజుకునేలా చేయాలన్నది బీఆర్ ఎస్ నిర్ణయం.
ఈ క్రమంలోనే ఈ నెల 27న బీఆర్ ఎస్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ను నింగి-నేల తాకేట్టుగా నిర్వహించాలని నిర్ణయించారు. దీని నిర్వహణకు ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిదిలో నాలుగు కమిటీలు కూడా వేశారు. మరోవైపు.. మాజీ సీఎం బీఆర్ ఎస్ అదినేత కేసీఆర్ ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల ద్వారానే.. తిరిగి ప్రజల్లోకి వచ్చేందుకు ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు. గత ఓటమి తర్వాత.. ఇప్పటి వరకు ఒకటి రెండుసార్లు మాత్రమే ఆయన బయటకు వచ్చారు. ఒకే ఒక్కసారి అసెంబ్లీకి వెళ్లారు. ఈ నేపథ్యం లో పార్టీ కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో సిల్వర్ జూబ్లీ కార్యక్రమం ద్వారా పార్టీ కార్యాచరణను కూడా ప్రకటించి.. తాను ప్రజల మధ్యకు రావాలని నిర్ణయించుకున్నారు.
అయితే.. నిర్ణయం తీసుకున్నంత తేలికగా.. ఏర్పాట్లు చేసినంత వేగంగా.. ప్రభుత్వం నుంచి సహకారం అయితే లభించడం లేదు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 30 వరకు పోలీసు యాక్టును అమలు చేస్తున్నట్టు కమిషనర్ ప్రకటించారు. పోలీసు యాక్ట్ 30 అమల్లోకి వచ్చినట్టు బోర్డులు పెట్టారు. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి లేదని చెబుతున్నారు. మరోవైపు.. బీఆర్ ఎస్ మాత్రం పోలీసు అదికారులకు సభపై విన్నపాలు పెట్టుకుంది. కానీ, రోజులు గడుస్తున్నా.. వారి నుంచి ఎలాంటి స్పందనా కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. సాధ్యమైనంత వేగంగా కోర్టును ఆశ్రయించి.. అనుమతులు తెచ్చుకునే దిశగా బీఆర్ ఎస్ అడుగులు వేస్తోంది. మరి న్యాయస్థానం ఏం చేస్తుందో చూడాలి.