మోడీ క్లియర్ టార్గెట్ !

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లను గెలుచుకోవటమే నరేంద్రమోడీ టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. మామూలుగా అయితే ఈ టార్గెట్ సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే పార్టీకి ఉత్తరాధిలో ఉన్నంత పట్టు దక్షిణాదిలో లేదు. దక్షిణాదిలోని ఆరు రాష్ట్రాలు కర్నాటక, తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణా, పాండిచ్చేరిలో బలహీనంగా ఉంది. ఉన్నంతలో కర్నాటకలోనే గట్టిగా ఉంది. మిగిలిన ఐదు రాష్ట్రాల్లో తెలంగాణాలో పర్వాలేదన్నట్లుగా ఉంది. ఈ రెండింటిని మినహాయిస్తే బీజేపీ ఒంటరిగా ఎక్కడ పోటీ చేసినా కనీసం డిపాజిట్లు తెచ్చుకోవటం కూడా అనుమానమే.

ఈ నేపధ్యంలోనే పొత్తులపైన ప్రత్యేక దృష్టిపెట్టింది. అందుకనే ఏపీలో కూడా పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబునాయుడుతో మాట్లాడింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు సీట్లలో పోటీచేయటంపైనే ఎక్కువగా దృష్టిపెట్టిందట. టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకున్నట్లు అధికారికంగా ప్రకటన రాలేదు. కాని రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారైపోయిందనే అనుకోవాలి. అందుకనే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పది పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీచేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం.

ఏలూరు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజంపేట, రాజమండ్రి, కాకినాడ, అరకు, శ్రీకాకుళం, నంద్యాల, ఒంగోలు, నెల్లూరు లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీచేయాలని ప్రతిపాదనలు సిద్ధంచేసిందట. ఇదే జాబితాను పార్టీలోని అగ్రనేతలకు రాష్ట్రపార్టీ అందించినట్లు సమాచారం. వీటిల్లో పదిసీట్లు కాదు కూడదంటే తక్కువలో తక్కువ ఎనిమిది సీట్లలో పోటీచేయాల్సిందే అని పట్టుబడుతున్నారట. పార్లమెంటు ఎన్నికల్లో పోటీపై కమలనాదులు ఇంతగా ఎందుకు పట్టుబడుతున్నట్లు ? ఎందుకంటే గెలుపు గ్యారెంటీ అని బాగా నమ్మకంగా ఉన్నారట.

ఒంటరిగా పోటీచేస్తే ఏ నియోజకవర్గంలో కూడా డిపాజిట్లు కూడా రాదు. కాని టీడీపీ, జనసేన పొత్తు ఉంటుంది కాబట్టి ఎక్కడ పోటీచేసినా గెలుపు గ్యారెంటీ అనే ధీమా బీజేపీ నేతల్లో పెరిగిపోతోందట. అందుకనే దగ్గుబాటి పురందేశ్వరి, సుజనా చౌదరి, సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్ లాంటి నేతలు పోటీకి రెడీ అయిపోతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకన్నా లోక్ సభ సీట్లపైనే బీజేపీ అధిష్టానం ఎక్కువగా దృష్టిపెట్టిందట. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.