కాంగ్రెస్ లో చేరికల జోష్..

కాంగ్రెస్ లో చేరికల జోష్ పెరిగిపోతోంది. తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇతర పార్టీల నుండి ముఖ్యంగా బీఆర్ఎస్ నుండి నేతలు హస్తంపార్టీలో చేరుతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణా ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో పట్నం మహేందర్ రెడ్డి దంపతులు చేరారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కూడా కాంగ్రెస్ లో చేరారు. అధికారపార్టీ నేత కంచర్ల చంద్రశేఖరరెడ్డి కూడా జాయిన్ అయ్యారు.

తొందరలోనే తాటికొండ రాజయ్య కాంగ్రెస్ గూటికి రాబోతున్నారు. వీళ్ళదారిలోనే మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా హస్తంపార్టీలో చేరటానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చాలామంది నేతలు కేవలం అధికారమే పరమావధిగా రాజకీయాలు చేస్తున్నారు. చాలామంది నేతలకు సిద్ధాంతాలు పాడు ఏమీ ఉండటంలేదు. అధికారం ఉండాలి లేకపోతే అధికారపార్టీలో ఉండాలంతే. ఎందుకంటే తమ వ్యాపారాలను, ప్రయోజనాలను కాపాడుకోవటం కోసమే చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు. కాబట్టి ఇలాంటి నేతల నుండి జనాలు ఏమీ ఆశించేందుకు లేదు.

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే బీఆర్ఎస్ నుండి వస్తున్న నేతలందరినీ చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడటం ఖాయం. ఎందుకంటే మందెక్కువైతే మజ్జిగ పలుచనవుతుందనే సామెత అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి కూడా అలాగే తయారవుతుంది. బీఆర్ఎస్ మొన్నటి ఎన్నికల్లో ముణిగిపోయిందంటే ఇలాంటి నేతలవల్లే అని అందరికీ తెలుసు. అధికారంలో ఉన్నపుడు అడ్డదిడ్డమైన సంపాదనకు లాకులెత్తిన కొందరు ప్రభుత్వానికి బాగా చెడ్డపేరు తెచ్చారు.

ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే అలాంటి నేతలే ఇపుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అంటే ఇక్కడ చేరిన తర్వాత మళ్ళీ తమ సంపాదనకే ప్రాధాన్యత ఇస్తారనటంలో సందేహంలేదు. కొద్దిరోజులకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గబ్బుపట్టిపోతుంది. తర్వాత ఎన్నికల్లో గెలిస్తే ఓకే అలాకాకుండా ఓడిపోతే మాత్రం మళ్ళీ ఇదే నేతలు అప్పుడు బీఆర్ఎస్ లో చేరిపోవటం ఖాయం. కాబట్టి వచ్చిన వాళ్ళని వచ్చినట్లుగా కాకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుని చేర్చుకుంటే బాగుంటుంది లేకపోతే కాంగ్రెస్ కూడా ముణిగిపోవటం ఖాయం.