ఏపీ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన‌ర్‌గా రేవంత్‌..!

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన వైఎస్ ష‌ర్మిల ఇప్ప‌టికే ఏపీలోదూకుడుగా ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. వైసీపీ స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో ఆమె  కామెంట్లు చేస్తున్నారు. స‌వాళ్లు-ప్ర‌తి స‌వాళ్ల‌తో వేడి పుట్టిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నియంత పాల‌న‌.. వైసీపీని గ‌ద్దె దించేస్తామ‌ని కూడా చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి ద‌శ‌లో ఆమె ప‌ర్య‌ట‌న ఇప్ప‌టికే ఒక‌సారి పూర్త యింది. ఇక‌, ఇప్పుడు మ‌రోసారి ఆమె.. ప‌ర్య‌ట‌న‌కు ప్రారంభం అవుతున్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌కు స్టార్ క్యాంపెయిన‌ర్‌గా తెలంగాణ సీఎం, ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డి వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్టు తెలుస్తోంది

ఆయ‌న ఎంపిక దాదాపు పూర్త‌యింద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇటీవ‌ల ఢిల్లీకి వెళ్లి వ‌చ్చిన ష‌ర్మిల‌.. నేరుగా కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నాయ‌కురాలు.. సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఎన్నిక‌ల‌కు ముందు  రేవంత్‌ను ఏపీకి పంపించా ల‌ని ఆమె విన్న‌వించిన‌ట్టు తాజాగా జాతీయ మీడియా పేర్కొంది. దీనికి సోనియా ఓకే చెప్పార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి ష‌ర్మిల‌.. ఆయ‌న‌తో ఏపీ వ్య‌వ‌హారాల‌పై ముచ్చ‌డించార‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. దీనిపై అప్ప‌ట్లో ఎవ‌రూ మాట్లాడ‌లేదు. కానీ, తాజాగా రేవంత్ వ్య‌వ‌హారం తెర‌మీద‌కి వ‌చ్చింది.

ఆయ‌న త్వ‌ర‌లోనే ఏపీలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్టు తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్గాలు తెలిపాయి. వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌ను ప పుర‌స్క‌రించుకుని విశాఖ ప‌ట్నం వేదిక‌గా .. భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్నాన‌ని.. ఇది ఈ నెలాఖ‌రులో ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ఈ స‌భ‌లో రేవంత్ రెడ్డి ప్ర‌సంగించ‌నున్నార‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. దీంతో రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారం ఇరు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, అదే సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.  

ఏపీలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల రెండుసార్లు విస్తృతంగా పర్యటించారు. అయితే ముఖ్యమైన నాయకులతో ఓ బహిరంగసభను ఇంకా ప్లాన్ చేసుకోలేదు.  షర్మిల తన కుమారుడి వివాహా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నెల 17న వివాహం పూర్తవుతుంది.  అందుకే 20న బహిరంగసభ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలోఉన్నారని స‌మాచారం.  ఇటీవల షర్మిల రేవంత్ రెడ్డిని కలిసి.. ఏపీ రాజకీయాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలన్నదానిపై మాట్లాడారు. బహిరంగసభలకు తాను హాజరవుతానని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చినట్లుగా చెబుతున్నారు.దీనికి పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది.