టీడీపీ కేడ‌ర్‌కి ఇది కస్టమైన పనే..

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ అధినేత చంద్ర‌బాబు పార్టీ నాయ‌కుల‌కు మేలిమి సూచ‌న చేశారు. పొత్తులు త‌ప్ప‌వ‌ని ఇప్ప‌టికే సంకేతాలు పంపించిన చంద్ర‌బాబు.. ఈ క్ర‌మంలో సీట్ల‌ను త్యాగాలు చేయాల‌ని చంద్ర‌బాబు తాజాగా పిలుపునిచ్చారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అంద‌రికీ ప‌దవులు ద‌క్కుతాయ‌ని హింట్ ఇచ్చారు. ఏకంగా 5 వేల మంది నాయ‌కుల‌తో ఒకేసారి టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన ఆయ‌న పార్టీలో ఉన్న నాయ‌కుల‌ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేశారు.

పొత్తుల అవ‌స‌రం.. అవ‌కాశంపై వారికి సోదాహ‌ర‌ణంగా వివ‌రించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ గెల‌వాల్సిన అవస‌రం కూడా చెప్పారు. ఇక‌, పార్టీలో చేరికల విష‌యాన్ని కూడా వివ‌రించారు. బీజేపీతో పొత్తు ఖాయ‌మేన‌ని చెప్పుకొచ్చిన చంద్ర‌బాబు.. ఈ క్ర‌మంలో మ‌రిన్ని స్థానాల‌ను వ‌దులుకోవాల‌న్నారు. ఇక్క‌డే అస‌లు స‌మ‌స్య తెర‌మీదికి వ‌చ్చింది. 2019 త‌ర్వాత నుంచి పార్టీలో అనేక కార్య‌క్ర‌మాలు తెర‌మీదికి వ‌చ్చాయి. ప్ర‌తి మూడు లేదా ఆరు మాసాల‌కు ఒక‌సారి ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంతో చంద్ర‌బాబు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు.

బాదుడే బాదుడు, సైకో పోవాలి-సైకిల్ రావాలి.. ఇలా.. అనేక కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించారు. ఆయా కార్య‌క్ర‌మాల‌కు నిధులు క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులే ఖ‌ర్చు పెట్టారు. అంతేకాదు.. త‌రచుగా నాయ‌కుల‌ను కూడా హెచ్చ‌రించారు. పార్టీ కోసం ప‌నిచేయ‌ని వారిని ప‌క్క‌న పెడుతున్నాట్టు హెచ్చ‌రించారు. దీంతో నాయ‌కులు అలెర్ట్ అయ్యారు. క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేశారు. కార్య‌క‌ర్త‌ల‌ను స‌మీక‌రించారు. వ‌చ్చేది మ‌న‌కే సీటు అని గ‌ర్వంగా చెప్పుకొచ్చారు. దీంతో కార్య‌క‌ర్త‌లు కూడా రెట్టించిన ఉత్సాహంతో ప‌నిచేశారు.

తీరా ఇప్పుడు ఎవ‌రికి టికెట్ ఉంటుందో .. ఉండ‌దో తెలియ‌ని ప‌రిస్థితిలోకి నెట్టేశారు. ఇక్కడ చిత్రం ఏంటేంటే.. వైసీపీలో అయినా.. ఒక నాయ‌కుడు పోతే.. మ‌రో నాయ‌కుడు.. సొంత పార్టీకి చెందిన వాడే రంగంలోకి దిగారు. వారి వెనుక కేడ‌ర్ న‌డుస్తుంది. కానీ, టీడీపీ ప‌రిస్థితి భిన్నంగా ఉంది.. ఇక్క‌డ టీడీపీ నాయ‌కుడిని కాదంటే.. వేరే పార్టీ జెండా మోయాల్సి వ‌స్తోంది. వేరే పార్టీ నాయ‌కుడికి జై కొట్టాల్సి వ‌స్తోంది. ఇది.. సాధ్య‌మేనా? నిన్న‌టి వ‌ర‌కు టీడీపీ జెండా మోసిన నాయ‌కులు.. ఇప్పుడు పొరుగు పార్టీ జెండా ప‌ట్టుకోవాలంటే.. వారిని ముందుగా స‌న్న‌ద్ధం చేయ‌క‌పోగా.. త‌ప్పుల‌పై త‌ప్పులు జ‌గ‌న్‌ను మించి చేస్తున్నార‌న్న భావ‌న బ‌ల‌ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇది ఎంత వ‌ర‌కు మేలు చేస్తుందో చూడాలి.