సర్వేల టెన్షన్ పెరిగిపోతోందా ?

తెలంగాణా బీజేపీలో టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవైపు సర్వేల్లో బీజేపీ గెలుచుకోబోయే ఎంపీల సంఖ్య ఇది అని వెల్లడవుతున్న జోస్యాలు. మరోవైపు కచ్చితంగా డబుల్ డిజిట్ టచ్ చేయాల్సిందే అన్న అగ్రనేతల ఆదేశాలు. ఈ రెండింటి మధ్యలో సమన్వయం సాధించటం ఎలాగ అన్న టెన్షన్ సీనియర్ నేతల్లో పెరిగిపోతోందని పార్టీవర్గాల సమాచారం. మొత్తం 17 పార్లమెంటు సీట్లలో ఎట్టి పరిస్ధితుల్లోను 10 సీట్లు గెలుచుకుపోవాల్సిందే అని ఇప్పటికే జాతీయ నాయకత్వం స్పష్టంగా చెప్పింది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరబాట్లు రిపీట్ కాకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదేపదే తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు సీనియర్లందరికి చాలాసార్లు చెప్పారు. అభ్యర్ధుల ఎంపికలో అన్నీ జాగ్రత్తలు తీసుకోమని సూచించారు. అగ్రనేతల సూచనలు, ఆదేశాలు ఎలాగున్నా రాబోయే ఎన్నికలపై రిలీజ్ అవుతున్న సర్వే జోస్యాలు టెన్షన్ పెంచేస్తున్నాయి. ఏ సర్వేని తీసుకున్నా బీజేపీకి మూడుసీట్లకన్నా ఎక్కువ రావని స్పష్టంగా చెప్పేస్తున్నది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా సర్వేల్లో బీజేపీకి మూడు లేదా నాలుగు సీట్లకు మించి రావని కొన్ని సర్వేలు చెప్పాయి. మరికొన్ని సర్వేలేమో సింగిల్ డిజిట్ దాటదని చెప్పాయి. సర్వేల్లో చెప్పినట్లుగా సింగిల్ డిజిట్ దాటలేదు. అయితే ఎన్నికలకు ముందు బీజేపీ బలం మూడు ఎంఎల్ఏలు మాత్రమే అయితే ఎన్నికల్లో ఆ బలం 8కి పెరిగింది. అంటే ఐదుసీట్లను అదనంగా గెలుచుకుకుంది. పెరిగిన ఐదుసీట్లే బీజేపీకి అతిపెద్ద విజయంగా చెప్పుకోవాలి.

ప్రస్తుత విషయానికి వస్తే బీజేపీకి నాలుగు ఎంపీలున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి పరిపాలనకు జనాలు సానుకులంగా స్పందిస్తున్నారు. దీనివల్ల రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సాధిస్తుందని సర్వేలు జోస్యం చెబుతున్నాయి. 17 సీట్లలో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్నాయి. బీఆర్ఎస్, బీజేపీలకు చెరో మూడుసీట్లు, ఎంఐఎంకు ఒక్కసీటు దక్కుతుందంటున్నాయి సర్వేలు. రేవంత్ దూకుడుచూస్తుంటే ఎన్నికల్లో పదిసీట్లకు మించి సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్, బీజేపీ రెండు నష్టపోతాయి. అందుకనే బీజేపీలో సర్వేల టెన్షన్ పెరిగిపోతోందట.