బాంబు పేల్చిన బండి!

తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్‌, ఎంపీ బండి సంజ‌య్ బాంబు పేల్చారు. ఏకంగా ఎనిమిది మంది బీఆఎస్ ఎమ్మెల్యేలు త‌మ‌కు ట‌చ్‌లో ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు. బీఆర్‌ఎస్‌కు ఎంపీ అభ్యర్థులు లేరని, ఉన్న వాళ్లు పక్క చూపులు చూస్తున్నారన్నారు. త‌మ పార్టీలో చేరేందుకు నాయ‌కులు క్యూ క‌ట్టే స‌మ‌యం వ‌చ్చింద‌న్నారు. ఎంపీగా పోటీ చేయమని అభ్యర్థులను కేసీఆర్ బతిమలాడుతున్నారని.. అయినా ఎవ‌రూ ఆయ‌న‌ను పట్టించుకోవ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించి హరీష్ రావుతో సహా ఎవ‌రైనా బీజేపీలోకి వస్తామని అంటే ఆహ్వానిస్తామన్నారు.

వారి మ‌ధ్య అవ‌గాహ‌న ఉంది..

ప్ర‌తిప‌క్షం బీఆర్‌ఎస్, అధికార ప‌క్షం కాంగ్రెస్‌కు మ‌ధ్య అవగాహన ఒప్పందం జ‌రిగింద‌ని బండి విమ‌ర్శించారు. అందుకే బీఆర్‌ఎస్ పాల‌న‌కు సంబంధించి ఇన్ని కుంభ‌కోణాలు బయటపడుతున్నప్ప‌టికీ.. కాంగ్రెస్ చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. అదే.. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే కేటీఆర్, కేసీఆర్ ఇప్పటికే జైలులో ఉండేవాళ్లని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే, కేసీఆర్.. ఎన్డీయేతో జ‌ట్టు క‌డ‌తార‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను ఆయ‌న ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఇదంతా కేసీఆర్‌ ఆడుతున్న మైండ్ గేమ్‌గా ఆయ‌న పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్‌ను ఎన్డీఏలో చేరుతామనీ అడిగితేనే చేర్చుకోలేదన్నారు.

కాంగ్రెస్ గ్రాఫ్ త‌గ్గింది!

రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ త‌గ్గింద‌ని బండి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారన్నారు. కర్ణాటకలోనే కాదు.. తెలంగాణలో సైతం గ్యారంటీల పేరుతో మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కి ఎన్ని సీట్లు వస్తాయనేది ఆ పార్టీ నేతలే చెప్పాలన్నారు. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయకుంటే ప్రజలే కాంగ్రెస్‌కి బుద్ది చెప్తారని బండి వెల్లడించారు. రేవంత్ రెడ్డి ఇంతకు ముందు కూడా బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటేనని ఆరోపించార‌ని గుర్తు చేశారు.

రాముడు-మోడీ!
పార్లమెంట్ ఎన్నికల్లో రాముడు-మోడీ ఒక్కవైఫు, రజాకార్లు, ఎంఐఎం, బీఆర్‌ఎస్ ఒక వైపు ఉన్నాయన్నారు. దేవుడిని రాముడిని నమ్మే వాళ్లు బీజేపీకి ఓటేస్తారన్నారు. బీఆర్ఎస్ అవినీతి అంతా కాగ్ రిపోర్ట్ ద్వారా బయట పడిందని బండి సంజయ్ చెప్పారు. హైదరాబాద్ పార్లమెంట్ సీటుపై కూడా దృష్టి పెట్టామని తెలిపారు.