రేవంత్ పాలనపై జనాల్లో మౌత్ పబ్లిసిటి ఎలా ఉంది?

రాబోయే ఎన్నికల్లో ప్రజాపాలన నినాదమే కాంగ్రెస్ అస్త్రంగా మారబోతోంది. ప్రజాపాలన నినాదంతో రేవంత్ రెడ్డి సామాన్యుల నుంచి మధ్య తరగతి జనాల్లోకి బాగా దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. మెజారిటీ ప్రజల సమస్యలపై తక్షణమే స్పందిస్తున్నారు. ప్రజాదర్బార్ నిర్వహించటం, జనాలకు బాగా ట్రాఫిక్ సమస్యలు సృష్టించిన ప్రగతిభవన్ ముందు ఇనుప కంచెను రోడ్డుమీద నుండి తొలగించటం, కుమారి అంటీ రోడ్డు పక్క క్యాంటిన్ను పోలీసులు తొలగిస్తే వెంటనే స్పందించి మళ్ళీ అక్కడే ఆమె బిజినెస్ చేసుకునేట్లు నిర్ణయించటం ఇలాంటివి సామాన్య జనాల్లో రేవంత్ క్రేజును పెంచాయి.

ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన సిక్స్ గ్యారెంటీస్ హామీల అమలు కూడా దిగువ, మధ్య తరగతి జనాలు ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ఇచ్చిన హామీలే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు రేవంత్ స్పందిస్తున్నారు. రేవంత్ వైఖరి వల్ల ఏమైందంటే పదేళ్ళ కేసీయార్ పాలనకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య జనాలు పోలిక చూస్తున్నారు. ప్రతి అంశంలోను కేసీయార్ పరిపాలనను రేవంత్ పాలనలోని తేడాను జనాలు చెప్పుకుంటున్నారు.

రేవంత్ పరిపాలనపై జనాల్లో మౌత్ పబ్లిసిటి చాలా పాజిటివ్ గా ఉంది. ఇలాంటి పాజిటివిటీనే రేవంత్ కోరుకుంటున్నారు. కేసీయార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మామూలు జనాలను సెక్రటేరియట్ లోకి అడుగు కూడా పెట్టనివ్వలేదు. అలాంటిది రేవంత్ సీఎం కాగానే జనాలందరికీ సెక్రటేరియట్ లోకి అనుమతిచ్చారు. ముఖ్యంగా మీడియా జనాలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే రేవంత్ ప్రతిరోజు సెక్రటేరియట్ కు వస్తున్నారు.

శాఖల వారీగా సమీక్షల్లో ఎక్కువ భాగం సెక్రటేరియట్ లోనే నిర్వహిస్తున్నారు. అదే కేసీయార్ అయితే నెలల తరబడి అసలు సచివాలయానికే వచ్చేవారు కాదు. శాఖల సమీక్షలు ఉండేవి కావు, మంత్రులనూ కలిసేవారు కారు. సెక్రటేరియట్ కే రాని, సమీక్షలు నిర్వహించని, జనాలను కలవని కేసీయార్ కు ముఖ్యమంత్రి పదవి ఎందుకనే జనాలు కూడా అధికారాన్ని ఊడబీకేశారు. ఇవన్నీ రేవంత్ కు ఇపుడు ప్లస్ పాయింట్లవుతున్నాయి. అందుకనే రాబోయే ఎన్నికల్లో ప్రజాపాలన అన్న నినాదాన్నే రాజకీయ అస్త్రంగా ప్రయోగించాలని డిసైడ్ అయ్యింది.