రెడ్లకు టీడీపీపై మోజు పుట్టిందా?

వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు తెలుగుదేశంపార్టీలో చేరబోతున్నారా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. చేరబోతున్న ముగ్గురు కూడా రెడ్డి సామాజికవర్గంలోని ప్రముఖులే కావడం గమనార్హం. విషయం ఏమిటంటే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి టీడీపీలో చేరటానికి రంగం సిద్ధమైపోయిందని సమాచారం. మాగుంటకు వైసీపీలో టికెట్ దొరకలేదు కాబట్టి టీడీపీలో చేరబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నదే.

మరి నెల్లూరు ఎంపీగా పోటీచేయాలని కోరుకున్నట్లే జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డికి టికెట్ ఖాయం చేశారు. అయినా ఎందుకు వైసీపీని కాదనుకుని టీడీపీలో చేరబోతున్నట్లు ? ఎందుకంటే పార్లమెంటు పరిధిలోకి వచ్చే నెల్లూరు, కావలి, ఉదయగిరిలో తాను చెప్పిన వాళ్ళకే అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని వేమిరెడ్డి పట్టుబట్టారట. అయితే జగన్ మాత్రం వేమిరెడ్డి అభ్యంతరం మేరకు నెల్లూరు సిటి టికెట్ మాత్రం అనిల్ కుమార్ యాదవ్ కు కాకుండా ఖలీల్ కు కేటాయించారు. అయితే ఖలీల్ ను కూడా వద్దని వేమిరెడ్డి పట్టుబట్టారు.

వేమిరెడ్డి చెప్పినట్లు అభ్యర్థులను మార్చటానికి జగన్ ఇష్టపడలేదు. అందుకనే పోటీ చేయకూడదని అనుకున్నారట. మరి వైసీపీ తరపున పోటీచేయనపుడు ఆల్టర్నేటివ్ ఏముంది ? టీడీపీ మాత్రమే కదా. అందుకనే తొందరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు సమాచారం. మంగళవారం చంద్రబాబుతో వేమిరెడ్డి భేటీ అయ్యారని కూడా అంటున్నారు. ఇక ఆదాల విషయం విచిత్రంగానే ఉంది. రాబోయే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా ఎంఎల్ఏగా పోటీచేయాలని అనుకున్నారు. ఆదాల అనుకున్నట్లే నెల్లూరు రూరల్ టికెట్ ను జగన్ కేటాయించారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల విస్తృతంగా పనిచేసుకుంటున్నారు. అలాంటిది ఆదాల కూడా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో ఎందుకు చేరాలని అనుకుంటున్నారో అర్ధంకావటంలేదు. తాను వైసీపీలోనే కంటిన్యు అవుతాననే ఆదాల చెబుతున్నా పార్టీ మారుతారనే ప్రచారం మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ ఇద్దరు ఎంపీలు తొందరలోనే టీడీపీ కండువా కప్పుకోబోతున్నట్లు పార్టీలో టాక్ పెరిగిపోతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.