ఉత్తరాంధ్రకు భారీ క్రేజు

రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీల టార్గెట్ ఉత్తరాంధ్ర మీదే ఉన్నట్లుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో పాటు చంద్రబాబునాయుడు ఇప్పటికే చాలాసార్లు ఉత్తరాంధ్రలో పర్యటించారు. తాజాగా ఎన్నికల ప్రచార సభలు సిద్ధం కూడా జగన్ ఉత్తరాంధ్రలోని భీమిలీ నియోజకవర్గంలోనే మొదలుపెట్టారు. తర్వాత కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా ఈ ప్రాంతం మీద దృష్టిపెట్టారు. ఇప్పటికే అరకు, నెల్లిమర్ల, వైజాగ్ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఈమె తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నారు.

వీళ్ళు కాకుండా తాజాగా నారా లోకేష్ కూడా తన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో మొదలుపెట్టారు. యువగళం పాదయాత్ర ముగింపు సభను భీమిలీలోనే పెట్టిన విషయం తెలిసిందే. ఈరోజు అంటే మంగళవారం మళ్ళీ జగన్ వైజాగ్ లో పర్యటించబోతున్నారు. ఏ రకంగా చూసినా అన్నీ పార్టీలు ఉత్తరాంధ్రపైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్లు అర్ధమైపోతోంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నాయి.

పై మూడు జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీలు, ఐదు పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో శ్రీకాకుళం జిల్లాలో రెండు, వైజాగ్ సిటీలోని నాలుగు నియోజకవర్గాలు మినహా మిగిలిన 28 సీట్లు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. అలాగే శ్రీకాకుళం ఎంపీ మినహా మిగిలిన నాలుగు నియోజవకర్గాల్లో వైసీపీ ఎంపీలే ఉన్నారు. ఇదే రిజల్టును వచ్చేఎన్నికల్లో కూడా రిపీట్ చేయించాలన్నది జగన్ పట్టుదల. అందుకనే ఇంతగా ఉత్తరాంధ్ర మీద కేంద్రీకరించారు.

ఇదే సమయంలో పోయిన పట్టును తిరిగి సాధించుకోవాలని చంద్రబాబు చాలా పట్టుదలగా ఉన్నారు. ఒకపుడు ఉత్తరాంధ్రలో టీడీపీ చాలా బలంగా ఉండేది. అలాగే జనసేన కూడా తన ప్రభావాన్ని రాబోయే ఎన్నికల్లో చాటుకోవాలని గట్టిగా డిసైడ్ అయ్యింది. అందుకనే పదేపదే పవన్ ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నది. వైజాగ్ సిటీలోని నాలుగు నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన 30 నియోజకవర్గాలు గ్రామీణ వాతావరణంలోనే ఉన్నాయి. మరి ఇంతమంది దృష్టిపెట్టిన కారణంగా జనాలు ఏ పార్టీని ఆధరిస్తారో చూడాలి.