చెప్పులు-త‌రిమికొట్ట‌డాలు-ఫామ్ హౌస్‌..

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ నేత‌ల‌కు, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ నాయ‌కుల‌కు మ‌ధ్య మాట‌ల యుద్దం చోటు చేసుకుంది. వారి వారి ప్ర‌సంగాల్లో చెప్పులు-త‌రిమికొట్ట‌డాలు-ఫామ్ హౌస్ వంటి వ్యాఖ్య‌లు ప‌దే ప‌దే చోటు చేసుకున్నాయి. కృష్ణా న‌దీ జ‌లాల‌ పై జ‌రుగుతున్న చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ను క‌రీంన‌గ‌ర్‌ ప్ర‌జ‌లు త‌రిమి కొట్టార‌ని, దీంతో ఆయ‌న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు వ‌చ్చార‌ని వ్యాఖ్యానించారు. అయినా.. ఇంకా బుద్ది రాలేద‌ని, కృష్ణాన‌ది జ‌లాల‌పై చ‌ర్చ సాగుతుంటే.. అసెంబ్లీకి రాకుండా.. ఫామ్ హౌస్‌లో ప‌డుకున్నార‌ని నిప్పులు చెరిగారు.

ఈ స‌మ‌యంలో జోక్యం చేసుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయ‌కుడు హ‌రీష్‌రావు.. సీఎం రేవంత్‌పై విరుచుకుప‌డ్డారు. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం దయ్యాలు వేదాలు వళ్ళించడం అవుతుందన్నారు. కోడంగల్ ప్రజలు తరిమితే మల్కాజ్‌గిరి వచ్చారంటు కౌంటర్ ఇచ్చారు. దీనికి రేవంత్ మ‌రోసారి ఘాటుగా ఆన్స‌ర్ ఇచ్చారు. ఎవ‌రు ఎవ‌రిని త‌రిమి కొట్టారో ప్ర‌జ‌ల‌కు తెలుసున‌ని.. అందుకే ఫాం హౌస్ నుంచి వ‌చ్చి మొహం చూపించ‌లేక పోతున్నార‌ని వ్యాఖ్యానించారు.

కాగా, స‌భ‌లో కృష్ణాన‌దిపై నిర్మించిన ప్రాజెక్టుల వ్య‌వ‌హారం.. సుదీర్ఘ చ‌ర్చ‌గా మారింది. గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అనాలోచిత నిర్ణ‌యాలు తీసుకున్న ద‌రిమిలా.. రాష్ట్రం ఎడారిగా మారింద‌ని సీఎం రేవంత్ స‌హా.. మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి బీఆర్ ఎస్ నేత‌ల నుంచి కూడా అదేస్థాయిలో కౌంట‌ర్ వ‌చ్చింది.

ఇదిలావుంటే, మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కూడా బీఆర్ ఎస్‌పై విరుచుకుప‌డ్డారు. నల్లగొండ ప్రజలు బీఆర్ఎస్‌ను చెప్పుతో కొట్టినట్టు తీర్పు ఇచ్చారని మంత్రి కోమ‌టిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్‌ స్వల్ప ఓట్లతో డిపాజిట్ దక్కించుకోగలిందని విమర్శించారు. అలాంటి పార్టీ నాయకుడు ఏ మొహంతో నల్లగొండలో సభ పెడతారని ప్రశ్నించారు. దీనిపై మాజీ మంత్రి హ‌రీష్ రావు కౌంట‌ర్ ఇచ్చారు. ‘ఆమేథిలో రాహుల్ గాంధీని చెప్పుతో కొట్టారని మేము కూడా అనొచ్చు’ అని వ్యాఖ్యానించారు. అయితే.. అటు మంత్రి, ఇటు మాజీ మంత్రి ఇద్ద‌రూ చెప్పుతో కొడతామని అన్న పదాన్ని అసెంబ్లీ రికార్డుల నుంచి తొల‌గించాల‌ని త‌ర్వాత‌.. ఇద్ద‌రూ కోర‌డం గ‌మ‌నార్హం.