లోకేశ్ నోటి నుంచి ‘రెడ్ బుక్’ మాట వచ్చినంతనే..?

ఏపీలో అసెంబ్లీ.. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ‘శంఖారావం’ పేరుతో మలిదశ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్. యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహించిన లోకేశ్.. ఇప్పుడు శంఖారావం పేరుతో సభల్ని నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతలు.. కార్యకర్తలు.. మద్దతుదారుల పై వైసీపీ ప్రభుత్వంలో దాడులు జరుగుతున్నాయని.. వేధింపులకు గురి చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన రెడ్ బుక్ ప్రస్తావన తేవటం తెలిసిందే.

జగన్ ప్రభుత్వంలో తమ పార్టీ వారికి.. సామాన్యులకు.. ఎదురయ్యే కక్ష సాధింపు చర్యలతో పాటు.. అధికారులు పక్షపాతంతో వ్యవహరించే ప్రతి అంశాన్ని తాను రెడ్ బుక్ లో రాసుకుంటానని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ లో నమోదు చేసిన ప్రతి అంశానికి తగిన పాఠం చెబుతామని చెప్పటం తెలిసిందే. పాదయాత్ర వేళ మొదలైన ఈ రెడ్ బుక్ మాట లోకేశ్ నోటి నుంచి వచ్చినంతనే..ఆయన సభలకు హాజరయ్యే వారి నుంచి వచ్చే స్పందన గురించి తెలిసిందే.

ఆదివారం ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురంలో మొదలైన శంఖారావం యాత్రలోనూ లోకేశ్ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. అప్పటివరకు ఆయన చేసిన వ్యాఖ్యలకు వచ్చిన స్పందన కంటే.. లోకేశ్ నోటి నుంచి రెడ్ బుక్ అన్న మాట వచ్చినంతనే భారీ ఎత్తున స్పందన రావటం ఆసక్తికరంగా మారింది. పార్టీ అధినేత చంద్రబాబు మీదా.. తన మీదా ఎన్ని కేసులు పెట్టినా తగ్గలేదని.. చట్టాల్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని.. వారందరిపైనా న్యాయ విచారణ చేపడతామని వ్యాఖ్యానించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామంటూ లోకేశ్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలకు సభికుల నుంచి వచ్చిన స్పందన హాట్ టాపిక్ గా మారింది. ప్రతి సభలోనూ లోకేశ్ నోటి నుంచి రెడ్ బుక్ ప్రస్తావన ఎక్కువసార్లు రావాలన్న అభ్యర్థన పార్టీ నేతల నుంచి వస్తుందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా లోకేశ్ స్పీచ్ లో రెడ్ బుక్ ప్రస్తావన.. ప్రసంగం మొత్తానికి హైలెట్ గా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.