రేవంత్ నిర్ణయంపై ఉత్కంఠ

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ పెరిగిపోతోంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ముసుగులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఇప్పటికే విజెలన్స్ విచారణలో తేలింది. ఈ విచారణను మరింత ముందుకు తీసుకెళ్ళటంలో ప్రభుత్వం ఏమిచేస్తుందన్న విషయం ఎవరికీ అంతుబట్టడంలేదు. విజిలెన్స్ విచారణలో అవినీతికి ప్రాధమిక సాక్ష్యాలను సేకరించిన ప్రభుత్వం తర్వాత స్టెప్ గా జ్యుడీషియల్ విచారణ చేయించబోతోందనే ప్రచారం పెరిగుతోంది. జ్యుడీషియల్ విచారణ జరిపించి తప్పుచేసిన వారిపై పర్ఫెక్టుగా చర్యలు తీసుకోవచ్చన్నది రేవంత్ ఆలోచనగా కనబడుతోంది.

ఇరిగేషన్ శాఖలో భారీ అవినీతి బట్టబయలైన తర్వాత ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పనిచేస్తున్న మురళీధరరావు, నల్లా వెంకటేశ్వర్లుకు ప్రభుత్వం ఉధ్వాసన పలికింది. మరళి దగ్గర రాజీనామా తీసుకున్న ప్రభుత్వం నల్లాను విధుల నుండి తొలగించింది. నిజానికి వీళ్ళిద్దరు రిటైర్ అయిపోయారు. అయితే కేసీయార్ ప్రభుత్వం వీళ్ళకి అదే పోస్టుల్లో రీ అపాయింట్మెంట్ ఇచ్చి కంటిన్యు చేయించింది. అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిలో వీళ్ళకి కూడా బాధ్యత ఉందని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది.

ఇపుడు సమస్య ఏమిటంటే జరిగిన అవినీతిని ఎవరి నుండి రికవరీ చేయాలి ? లేదా ఎవరిని బాధ్యులను చేసి యాక్షన్ తీసుకోవాలి అని. మామూలుగా అయితే రికవరీ సాధ్యంకాదు. ఎందుకంటే వేలకోట్ల రూపాయల అవినీతిని నిరూపించటమూ సాధ్యంకాదు, అంత డబ్బును రికవరీ చేయటం అంతకన్నా చాలా కష్టమని అందరికీ తెలిసిందే. మరిపుడు ప్రభుత్వం ఏమిచేయాలి ? అవినీతి జరిగిందని తెలిసినా అక్రమార్కులను అలా వదిలేయాల్సిందేనా ?

రెండో ఆప్షన్ ఏమిటంటే బాధ్యులని తేలిన వాళ్ళను ప్రాసిక్యూట్ చేయాలి ? ఇదికూడా ఏమంత తేలికైన విషయం కాదు. విచారణ కమిటీలు అవినీతిపరులని తేల్చిన వాళ్ళల్లో ఎక్కువమంది ఉన్నతాధికారులే ఉంటారు. మరి వీళ్ళకి అడ్డదిడ్డమైన ఆదేశాలిచ్చి అవినీతికి చేయించి, పాల్పడిన రాజకీయ నేతల మాటేమిటి ? వాళ్ళపై ఎవరు చర్యలు తీసుకోవాలి ? ఇపుడు కాళేశ్వరమే తీసుకుంటే ఇందులో వేల కోట్ల రూపాయలు తినేశారని కేసీయార్ కుటుంబంపై రేవంత్ అండ్ కో చాలాకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. మరి రేపు కేసీయార్ పై ప్రభుత్వం యాక్షన్ తీసుకోగలదా ?