సీఎం రేవంత్ ‘చారిత్ర‌క’ నిర్ణ‌యాలు

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌ద‌విని చేప‌ట్టిన రోజు నుంచి చారిత్ర‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. నంది అవార్డుల పేరును గ‌ద్ద‌ర్ అవార్డులుగా మార్చారు. గ‌ద్ద‌ర్‌కు విగ్ర‌హం ఏర్పాటు చేసేందుకు అనుమ‌తి ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు మ‌రిన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నట్టు అసెంబ్లీ వేదిక‌గా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తున్నట్లుసంచ‌ల‌న‌ ప్రకటన చేశారు. దీనికి కార‌ణం వివ‌రిస్తూ.. ప్రజాస్వామ్యంలో రాచరికం ఉండకూడదని భావిస్తున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో చార్మినార్, కాకతీయుల ఆనవాళ్ల వంటి రాచరిక పోకడలు ఉన్నాయ‌ని సీఎం రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. అందుకే చిహ్నం మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇక‌, ఇటీవ‌ల ‘టీఎస్’ ను ‘టీజీ’గా మారుస్తూ.. నిర్ణ‌యం తీసుకున్నారు. దీనిపైనా రేవంత్ వివ‌ర‌ణ ఇచ్చారు. “తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం టీడీ అని రాసుకునేవాళ్లం. వాహనాలు, బోర్డులపై అంతా టీజీ అని రాసుకున్నారు. కొందరు యువకులు తమ గుండెలపై పచ్చబొట్టు కూడా వేసుకున్నారు. కేంద్రం సైతం తమ నోటిఫికేషన్ లో టీజీ అనే పేర్కొంది. అందుకే టీజీగా మార్చాలని నిర్ణయించాం” అని రేవంత్ వెల్ల‌డించారు.

అదేస‌మ‌యంలో రాష్ట్ర గీతంగా ‘జయజయహే తెలంగాణ‌’ గీతం ఎంపిక చేస్తున్న‌ట్టు చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరికీ స్ఫూర్తి ఇచ్చిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆ పాట రాష్ట్ర గీతం అవుతుందని అంతా భావించినా.. ఆ పాటను నిషేధించినంత పని చేశారని బీఆర్ ఎస్ పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ పాటను రాష్ట్ర గీతంగా గుర్తించామ‌న్నారు.

అదేస‌మ‌యంలో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హంలో కూడా మార్పులు చేర్పులు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపైనా రేవంత్ వివ‌ర‌ణ ఇచ్చారు. “తెలంగాణ తల్లి అంటే మనకు అమ్మ, అక్క, చెల్లి గుర్తు రావాలి. తెలంగాణ ఆడబిడ్డలు కిరీటాలు పెట్టుకుని ఉండలేదు. తెలంగాణ తల్లి శ్రమజీవికి ప్రతీకగా ఉండాలి. అందుకే.. ఆ విగ్ర‌హంలో కూడా మార్పులు చేస్తున్నాం” అని సీఎం రేవంత్ చెప్పారు.