మెరుస్తున్న ర‌త్నాలు.. పీవీ స‌హా ముగ్గురికి భార‌త‌ర‌త్న‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 400 సీట్ల‌ను తెచ్చుకుంటాన‌ని ప్ర‌క‌టించిన ద‌రిమిలా.. వేస్తున్న అడుగులు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మ‌రింత ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ఇటీవ‌లే.. బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి భార‌త‌రత్న ప్ర‌క‌టించిన ప్ర‌ధాన మంత్రి మోడీ ప్ర‌భుత్వం.. తాజాగా మ‌రో ముగ్గురికి కూడా ర‌త్నాలు ప్ర‌క‌టించింది. అయితే.. దీనివెనుక పూర్తిగా రాజ‌కీయ వ్యూహం ఉండ‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణ‌కు చెందిన మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు కేంద్రం తాజాగా భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని నేరుగా ప్ర‌ధాని మోడీ త‌న ఎక్స్ ఖాతాలోనే పేర్కొన్నారు. దేశానికి సంస్క‌ర‌ణ‌ల మార్గాన్ని చూపిన నేత‌గా.. దార్శ‌నికుడిగా.. పీవీ నిలుస్తార‌ని ప్ర‌ధాని కొనియాడారు. అంతేకాదు.. ఇది భార‌త దేశం త‌న‌ను తాను గ‌ర్వించుకునే క్ష‌ణాల‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు.

పీవీతోపాటు.. మాజీ ప్ర‌ధాని చ‌ర‌ణ్‌సింగ్‌, స‌హా.. వ్య‌వ‌సాయ సంస్క‌ర‌ణ‌ల పితామ‌హుడిగా పేరొందిన స్వామినాథ‌న్‌కు కూడ భార‌త ర‌త్న ప్ర‌క‌టించారు. నిజానికి వీరంతా కూడా.. ర‌త్నాల‌కు అర్హులే. అంతేకాదు.. వీరిలో పీవీ.. కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు, ప్ర‌ధాని కూడా. కానీ, ఇప్పుడు ఈయ‌న‌కు ర‌త్నం ఇవ్వ‌డం వెనుక పూర్తిగా ఆ పార్టీని డిఫెన్స్‌లోకి నెట్టేసిన‌ట్టు అయింది. అంతేకాదు.. స్వామి నాథ‌న్ కూడా.. కాంగ్రెస్ నాయ‌కుడే. ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప‌నిచేశారు. ఆయ‌న‌కు ఇవ్వ‌డం వెనుక కూడా కాంగ్రెస్ టార్గెట్ ఖ‌చ్చితంగా క‌నిపిస్తోంది. మొత్తంగా.. త‌మ వారికే ర‌త్నాలు మెరుస్తున్నా.. ఆ కాంతులు.. కాంగ్రెస్‌కు సోకక‌పోవ‌డం గ‌మ‌నార్హం.