ఏపీ బీజేపీలో ‘సొంత’ నిర్ణయాల చర్చ?

రాష్ట్ర బీజేపీలో నాయ‌కుల నియామ‌కం.. కొత్త‌గా వ‌చ్చే వారికి అవ‌కాశం ఇవ్వ‌డం… ఉన్న వారికి ప‌నులు కేటాయించ‌డం.. అనేది స‌హ‌జం. పార్టీ చీఫ్‌గా ఉన్న మాధ‌వ్ చేయాల్సిన ప‌నులు కూడా ఇవేన‌ని అంటున్నారు. కానీ, ఆయ‌న మాత్రం మౌనంగా ఉంటున్నారు. కొత్త నిర్ణ‌యాలు స‌హా.. కొత్త నియామ‌కాల జోలికి కూడా పోవ‌డం లేదు. ఎక్క‌డా కూడా కొత్తగా ఏ కార్య‌క్ర‌మం గురించి కూడా చ‌ర్చించ‌డం లేదు. ఇది పార్టీలో తీవ్ర నైరాశ్యానికి గురి చేస్తోంది.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో బీజేపీ ప‌రిస్థితి ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ఉంద‌ని సీనియ‌ర్లు వాపోతున్నారు. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. తీవ్ర నిరాస‌లో ఉన్నారు. పార్టీ ఇలానే ఉంటే ఎలా? అని ఆయ‌న త‌ర‌చుగా వాపోతున్నారు. పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు చేపట్ట‌డం లేద‌ని.. నాయ‌కుల నియామ‌కాలు.. ప‌ద‌వుల పంపిణీ వంటివి కూడా లేకుండాcపోయింద‌ని.. త‌న‌కు చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నార‌ని చెబుతున్నారు.

మ‌రోవైపు.. సీమ‌కు చెందిన విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి వంటి యువ నాయ‌కులు కూడా నిరాస‌తోనే గ‌డిపేస్తున్నారు. త‌మకు గ‌తంలో ఉన్న ప్రాధాన్యాలు లేవ‌ని వాపోతున్నారు. ఇక‌, ప‌ద‌వులు కావాల్సిన వారు కూడా.. రాష్ట్రంలో ప‌నికాదని భావించి కేంద్రంలోనూ.. ఆర్ ఎస్ ఎస్‌తో చెలిమి  ఉన్న నాయ‌కులు అక్కడ ప్ర‌య‌త్నించి.. ప‌నులు చేయించుకుంటున్నారు. దీంతో రాష్ట్ర నాయ‌క‌త్వంపై పెద్ద‌గా ఎవ‌రూ స్పందించ‌డం లేదు. ఇక‌, మాధ‌వ్ విష‌యానికి వ‌స్తే.. ఇలాంటి కార్య‌క్ర‌మాలు తాను చేయ‌న‌ని తెగేసి చెబుతున్నార‌ట‌.

ఏదైనా ఉంటే.. పార్టీ అధిష్టానం ద‌గ్గ‌ర చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఆయ‌న చెబుతున్నారు. దీంతో ఇప్పుడు మండ‌ల‌స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు క‌మిటీలు లేవు. నాయ‌కులు ఉన్నా.. వారికి ప‌నులు కూడా ద‌క్క‌డం లేదు. సొంత‌గా నిర్ణ‌యం తీసుకునేందుకు మాధ‌వ్ వెనుకాడుతున్నందునే ఇలా జ‌రుగుతోంద‌న్న చ‌ర్చ అయితే.. జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇలానే గ‌డిపేస్తారా? లేక‌… ఏమైనా మార్పు ఉంటుందా? అనేది చూడాలి.