చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఇప్పుడు జ‌గ‌న్?

ఏపీలో కీల‌క నాయ‌కులు, ప్ర‌ధాన పార్టీలుగా ఉన్న వారు ఢిల్లీకి క్యూ క‌ట్టారు. ఒక‌రు త‌ర్వాత ఒక‌రుగా ఢిల్లీ పెద్ద‌ల ఆశీస్సుల కోసం.. త‌ర‌లి వెళ్తున్నారు. వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి.. ప్ర‌ధానంగామూడు పార్టీలు కూడా.. బీజేపీ వైపు చూడ‌డం.. ఆ పార్టీతో చేతులు క‌లిపేందుకు ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌డం ఆస‌క్తిగా మారింది. వాస్త‌వానికి ఏపీలో బీజేపీ ప‌రిస్థితి జీరోనే అయిన‌ప్ప‌టికీ.. నాయ‌కులు మాత్రం ఆపార్టీకి ప్రాధాన్యం ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికే ఢిల్లీలో ఉన్నారు. బుధవారం రాత్రి 11.30 గంట‌ల స‌మ‌యంలో వేచి ఉండి మ‌రీ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షాతో భేటీ అయ్యారు. చ‌ర్చ‌లు కొలిక్కి వ‌చ్చాయో.. మిత్ర‌త్వం క‌లుపు కొందామ‌ని అభ‌యం ఇచ్చారో లేదో ఇంకా స‌స్పెన్సుగానే ఉంది. కానీ, బీజేపీ పొత్తు కోసం చంద్ర‌బాబు వేచి ఉండ‌డం.. చ‌ర్చ‌గా మారింది.

ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ కూడా.. ఢిల్లీబాట ప‌డుతున్నారు. ఈరోజు(గురువారం) సాయంత్రం ఆయ‌న ఢిల్లీ వెళ్లేందుకు రెడీ అవుతున్నార‌ని జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. షెడ్యూల్ కూడా ఖ‌రారు కావ‌డంతో విజ‌య‌వాడ నుంచి నాదెండ్ల మ‌నోహ‌ర్ హైద‌రాబాద్‌కు వెళ్లిపోయారు. దీంతో జ‌న‌సేన అధినేత కూడా.. బీజేపీ ద‌గ్గ‌ర‌కు రాయ‌బారానికి వెళ్లిపోనున్నారు. ఈ రెండు పార్టీల వ్య‌వ‌హారం ఇలా ఉంటే.. ఇప్పుడు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఢిల్లీ కి వెళ్తున్నారు.

సీఎం జ‌గ‌న్ శుక్ర‌వారం ఉద‌యం ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయ‌న నేరుగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని, కేంద్ర మంత్రి అమిత్‌షాను క‌ల‌వ‌నున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాలుచెబుతున్నాయి. అయితే.. రాష్ట్ర బ‌డ్జెట్‌లో కేటాయింపులు, నిధుల కోస‌మే వెళ్తున్నార‌ని చెబుతున్నా ఢిల్లీలో జ‌రుగుతున్న ఏపీ రాజ‌కీయ ప‌రిణామాల‌పైనే ఆయ‌న చ‌ర్చించేందుకు వెళ్తున్నార‌ని.. రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. ఏదేమైనా.. ఒక్క ఓటు, ఒక్క సీటు లేని బీజేపీ ముందు.. నాయ‌కులు క్యూ క‌ట్ట‌డం ఆసక్తిగా మారింది.