వైసీపీ ఎమ్మెల్యేల‌కు సినిమా చూపించిన జ‌గ‌న్‌!

వైసీపీ ఎమ్మెల్యేల‌కు సీఎం జ‌గ‌న్ సినిమా చూపించారు. నిజ‌మే.. ఇది వాస్త‌వ‌మే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, ఘటనల ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించిన సినిమా ‘యాత్ర 2` సినిమాను వైసీపీ ఎమ్మెల్యేల‌కు ద‌గ్గ‌రుండి మ‌రీ ఆయ‌న చూపించారు. ఈ సినిమా.. ఈ గురువారం(ఫిబ్రవరి 8న) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతోంది. ప్రేక్షకుల కంటే కొన్ని గంటల ముందు బుధ‌వారం రాత్రి వైసీపీ ఎమ్మెల్యేలకు స్పెషల్ షో చూపించాల‌ని సీఎం జ‌గ‌న్ భావించారు.

విజయవాడలోని కళా నగర్ ఏరియాలో కల ట్రెండ్ సెట్ మాల్లోని కాపిటల్ సినిమాస్ స్క్రీన్లలో ‘యాత్ర 2’ స్పెషల్ షోలు స్టార్ట్ అయ్యాయి. జగన్ నేతృత్వంలోని వైసీపీ ఎమ్మెల్యేలు పలువురు సినిమాకు హాజరు అయ్యారు. తమ పార్టీ అధినేత సినిమా కావడంతో ఆసక్తి వీక్షించారు. సాధారణంగా ప్రతి సినిమాకు క్రిటిక్స్ నుంచి ఫస్ట్ రివ్యూ రావడం కామన్. బట్, ఫర్ ఏ ఛేంజ్ ‘యాత్ర 2’ సినిమాకు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేగా ఎన్నికై చట్ట సభల్లో అడుగు పెట్టిన ప్రజా ప్రతినిధుల నుంచి ఫస్ట్ రివ్యూ వ‌చ్చే అవ‌కాశం ఉంది. కాగా, మొత్తం సీఎం మిన‌హా.. 150 మంది ఎమ్మెల్యేల్లో ఈ సినిమాను చూసేందుకు 60 మంది మాత్ర‌మే వ‌చ్చారు. ఆసాంతం ఈ సినిమాను అంద‌రూ వీక్షించారు. బ‌డ్జెట్ స‌మావేశాలు ముగిసిన వెంటనే అంద‌రూ హాల్ కు క్యూ క‌ట్టారు.

ఇదీ క‌థ‌..

దర్శకుడు మహి వి రాఘవ్ తాను చెప్పాలని అనుకున్న కథ గురించి స్పష్టంగా చెప్పారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో 2009 నుంచి 2019 మధ్య జరిగిన అంశాల ఆధారంగా ‘యాత్ర 2’ తీశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏం జరిగింది? అనేది తెరపై చూపించారు. కొన్ని కల్పిత సన్నివేశాలు ఉన్నాయి. తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం కొడుకు ఎటువంటి పోరాటం చేశాడనేది కథ ద్వారా వివ‌రించారు. మ‌మ్ముట్టి వైఎస్ పాత్ర‌ను పోషించారు.