గాంధీ రాక‌.. టీడీపీకి పండ‌గేనా!

ఆర్. గాంధీ. ద‌ళిత నాయ‌కుడిగా రాజకీయాల్లోనూ.. రాయ‌లసీమ‌లోనూ ప్రాచుర్యం పొందిన ఈయ‌న‌.. టీడీపీ చెంత‌కు రానున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్‌. గాంధీ ఒక‌ప్పుడు కాంగ్రెస్‌లో ఉండి విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. వైసీపీకి చేరువ‌య్యారు. కొన్నాళ్లు క‌నుమ‌రుగ‌య్యారు. వైసీపీలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ద‌ళితుల‌కు ప్రాధాన్యం ఇస్తున్న క్ర‌మంలో ఆయ‌న‌ను స‌ల‌దారుల క‌మిటీకి స‌భ్యుడిగా తీసుకున్నారు. దీంతో ప్రాధాన్యం పెరిగింది.

కానీ, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి, గాంధీకి మ‌ధ్య పొస‌గ‌ని కార‌ణంగా.. ఆయ‌న రెండేళ్లుగా పార్టీకి, కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. వాస్త‌వానికి ఈయ‌న వ‌చ్చే ఎన్నికల్లో ఏదో ఒక నియోజ‌క వ‌ర్గం కావాల‌ని కోరుతున్నారు. కానీ, పార్టీ ప‌రిశీల‌న‌లో ఏమాత్రం లేదు. ఇది కొంత ఆవేద‌న క‌లిగించింది. దీంతో గాంధీ త‌న దారి తాను చూసుకునేందుకు రెడీ అయ్యారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇక‌, పార్టీలో ఉండ‌లేన‌ని కూడా చెప్పారు.

టీడీపీలో చేరేందుకు గాంధీ రెడీ అయ్యారు. మ‌రి గాంధీ రాక‌తో టీడీపీకి లాభ‌మెంత‌? అనేది ఆస‌క్తిగా మారింది. ద‌ళిత నాయ‌కుడిగా మంచి పేరు ఉన్న గాంధీకి ఫాలోవ‌ర్లు త‌క్కువ‌గా ఉన్నారు. నిజాయితీ ప‌రుడు అనే పేరు తెచ్చుకున్నా.. పాత‌త‌రం నాయ‌కుడు కావ‌డం, పెద్ద‌గా ఫాలోయింగ్ లేక‌పోవ‌డం వంటివి మైన‌స్‌లుగా ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ.. మీడియా ప‌రంగా కానీ.. స‌భ‌ల్లో కానీ బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు మంచి గుర్తింపే ఉంది.

ఈ నేప‌థ్యంలో చిత్తూరులోని కీల‌క‌మైన ఎస్సీ స్థానాలు స‌త్య‌వేడు వంటి చోట్ల గాంధీ ప్రభావం చూపించే అవ‌కాశం ఉంది. అదేవిధంగా పూత‌ల‌ప‌ట్టు, తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం త‌దిత‌రాల‌లో గాంధీ ప్ర‌భావం ఉంటుంద‌నేది కొంత వ‌ర‌కు నిజ‌మే. దీనిని దృష్టిలో పెట్టుకునే చంద్ర‌బాబు సైతం ఆయ‌న‌ను పార్టీలోకి ఆహ్వానించేందుకు రెడీ అయ్యారు. గాంధీ రాక‌తో.. క‌నీసంలో క‌నీసం.. 1 శాతం ఓటు బ్యాంకు అయినా.. త‌మ‌కు అనుకూలంగా మారుతుంద‌నేది టీడీపీ నేత‌లు చెబుతున్న మాట‌.