స‌ర్దుబాటు బాగుందే.. టీడీపీ-జ‌న‌సేన స్ట్రాట‌జీ.. !

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి తమ పార్టీ నాయ‌కుల‌ను బుజ్జ‌గించే విష‌యంలో టీడీపీ-జ‌న‌సేన కూటమి చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో విడివిడిగా పోటీ చేయ‌డంతో దాదాపు నేత‌లు అంద‌రికీ అవ‌కాశం ద‌క్కింది. అయితే.. ఇప్పుడు రెండు పార్టీలు కూడా విడిగా కాకుండా.. ఓటు బ్యాంకు చీల‌కుండా చూసే ల‌క్ష్యంతో ఉమ్మ‌డిగా బ‌రిలోకి దిగుతున్నాయి. దీంతో రాజ‌కీయంగా ఇది బాగానే ఉన్నా.. పార్టీల ప‌రంగా ఇబ్బందిగా ఉంది.

టికెట్లు ఆశించిన నాయ‌కుల‌కు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ, జ‌న‌సేన‌లు రెండూ కూడా ఇవ్వ‌లేక పోతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన పోటీ ఉండ‌డం. బ‌ల‌మైన నాయ‌కుల అవ‌స‌రం ఉన్న నేప‌థ్యం లో నాయ‌కుల‌కు కొంద‌రికి టికెట్ ద‌క్కే అవ‌కాశం లేకుండా పోయింది. అయితే.. ఈ ప‌రిస్తితిని ఆ నేత‌లు కొంద‌రు జీర్ణించుకునే ప‌రిస్థితి లేదు. అందుకే.. టీడీపీ-జ‌న‌సేన‌లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నా యి. దీనిలో భాగంగా.. నాయ‌కుల‌కు ముందు న‌చ్చ‌చెబుతున్నారు.

దీనికి సంబంధించి ఈనెల 7, 8 తేదీల్లో ఇరు పార్టీల అధినేత‌లు, లేదా.. కీల‌క నాయ‌కులు పార్టీ నేత‌లు, టికెట్ ఆశావ‌హుల‌తో భేటీ అవుతున్నారు. వారికి స‌ర్దిచెబుతారు. టికెట్ ఎందుకు ఇవ్వ‌లేక పోయార‌నే విష‌యాన్ని వివ‌రిస్తారు. అదేస‌మ‌యంలో వారి ఇబ్బందుల‌ను.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌ద‌రు టికెట్ ప‌రిధిలో ఉన్న పోటీని కూడా వెల్ల‌డిస్తారు. దీంతో కొంత వ‌ర‌కు ఆగ్ర‌హం, ఆవేశం త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు.. మాన‌సికంగా సిద్ధం చేయ‌డం.

ఇది పార్టీల‌కు అత్యంత కీల‌కంగా మారింది. నాయ‌కుల‌కు టికెట్ లేద‌ని చెప్ప‌డం సుల‌భమే కావొచ్చు కానీ, వారు పార్టీతోనే ఉండేలా.. పార్టీలోనే ఉండేలా.. పార్టీ గెలుపు కోసం ప‌నిచేసేలా.. చేసుకోవ‌డం క‌ష్టం. ఎంత వీర విధేయులైనా పార్టీ టికెట్ కాదంటే.. ర‌గిలి పోతుంటారు. దీంతో ఇలాంటి వారిని మౌల్డ్ చేసుకునేందుకు పార్టీలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ముందుగానే వారిని మాన‌సికంగా సిద్ధం చేస్తూ.. నెమ్మది నెమ్మ‌దిగా వారిని కూల్ చేస్తున్నాయి. మొత్తానికి ఈ వ్యూహం ఏమేర‌కు వ‌ర్కువుట్ అవుతుందో చూడాలి.