కూటమిదే పై చేయా ?

తొందరలోనే జరగబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిదే పైచేయా ? తాజాగా వెల్లడైన ఒక సర్వే ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. రైజ్ అనే సంస్థ ఏపీలోని రాజకీయ పరిస్ధితులపై సర్వే జరిపించింది. అందులో రెండుపార్టీల కూటమిదే పై చేయని స్పష్టంగా తేలిందట. సర్వే వివరాల ప్రకారం కూటమికి 94 స్ధానాలు దక్కుతాయి. వైసీపీకి 46 సీట్లు వస్తాయి. మిగిలిన 35 నియోజకవర్గాల్లో మూడుపార్టీల మధ్య హోరాహోరీ జరుగుతుందని తేలిందట.

అయితే సర్వేలో కొన్ని కీలకమైన పాయింట్లు ఉన్నాయి. అదేమిటంటే రెండు పార్టీలతో పాటు బీజేపీ కలిస్తుందా లేదా అన్నది కీలకమైనది. బీజేపీ కూడా కలిస్తే కూటమి సీట్లు తగ్గిపోతాయట. బీజేపీ కలవకపోతేనే 94 సీట్లు వస్తాయని తేలిందట. ఎందుకంటే జనాలు బీజేపీపైన బాగా మండిపోతున్నారన్న విషయం సర్వే సందర్భంగా బయటపడిందట. అందుకని పొత్తులో బీజేపీని కలుపుకుంటే దాని ప్రభావం మిగిలిన రెండుపార్టీలు కూడా భరించాల్సుంటుందని తేలిందట. అందుకని రైజ్ సంస్ధ కూడా టీడీపీ, జనసేన పొత్తు ప్రభావంపైన మాత్రమే సర్వేచేసిందని అర్ధమవుతోంది.

పోయిన ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు రావటంలో నాలుగు జిల్లాలు కీలకపాత్ర పోషించాయి. రాయలసీమలోని కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. కడపలో పది సీట్లు, కర్నూలులో 14 నియోజకవర్గాలు, నెల్లూరులోని పది, విజయనగరం జిల్లాలోని 9 స్ధానాల్లో టీడీపీకి ఒక్కటంటే ఒక్కసీటు కూడా దక్కలేదు. పైగా నాలుగు జిల్లాలే వైసీపీకి 33 నియోజకవర్గాలను అందించాయి. అయితే రాబోయే ఎన్నికల్లో వైసీపీకి అంత సీనుండదని తేలిందట.

కడప జిల్లా పరిస్ధితి కాస్త అయోమయంగా కనిపించినా మిగిలిన కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీకి ఏకపక్ష ఫలితాలు రావని మాత్రం తేలిపోయిందట. పైగా కొన్ని జిల్లాల్లో బాగా వ్యతిరేకత ఉందని కూడా అర్ధమైందని రైజ్ చెప్పింది. రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో పోయిన ఎన్నికల్లో వైసీపీ 49 చోట్ల గెలిచింది. రాబోయే ఎన్నికల్లో కూటమి అధికారపార్టీకి చాలా నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు తేలిందట. అయితే కూటమి గెలుచుకునే సీట్లు, టైట్ ఫైట్ లాంటి వివరాలను ప్రకటించలేదు. ఏదేమైనా రైజ్ తాజా సర్వే ప్రకారం కూటమిదే అధికారమని తేలిపోయింది.