కేసీఆర్ ఎలక్షన్ ప్లాన్ రెడీ అయ్యిందే !

రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తొందరలోనే యాక్టివ్ కావాలని కేసీయార్ రెడీ అవుతున్నారు. 8వ తేదీన మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల తర్వాత 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో బహిరంగసభలకు ప్లాన్ చేస్తున్నారు. 15 లేదా 16 తేదీల్లో నల్గొండలో భారీ బహిరంగసభను నిర్వహించాలని అనుకున్నారట. ఇందులో భాగంగానే నల్గొండ జిల్లాలోని సీనియర్ నేతలతో కేసీయార్ భేటీ అయ్యారు. జిల్లాలోని పరిస్ధితులను సమీక్షించారు. బహిరంగసభకు తక్కువలో తక్కువ 2 లక్షల మంది జనాలను సమీకరించి సత్తా చాటాలని ప్లాన్ చేశారని సమాచారం.

జల వనరులకు సంబంధించిన వాస్తవాలను శ్వేతపత్రాల విడుదల రూపంలో జనాలకు తెలియజేయాలని కేసీయార్ అనుకుంటున్నారట. తన హయాంలో కృప్ణా, గోదావరి జలాల వినియోగంలో, ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణాకు నష్టం జరిగిందన్న కాంగ్రెస్ ప్రభుత్వ వాదన, ఆరోపణలు అన్నీ అబద్ధాలే అని నిరూపించటమే కేసీయార్ ఉద్దేశ్యంగా కనబడుతోంది. అందుకనే జలవనరుల అంశంపై ప్రజలకు సుదీర్ఘ వివరణను ఇవ్వటానికి కేసీయార్ మెటీరియల్ రెడీ చేసుకుంటున్నారట. బహిరంగసభలో శ్వేతపత్రం రిలీజ్ చేయటమే కాకుండా ప్రతి ఇంటికి వాస్తవ నివేదిక పేరుతో పాంప్లేట్లను పంపిణీ చేయాలని కూడా డిసైడ్ చేశారట.

రెండు పార్టీలు కూడా జల వనరులపై ఇంతపెద్ద ఎత్తున అస్త్రాలను రెడీ చేసుకుంటున్నట్లు ? ఎందుకంటే తొందరలోనే పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మ్యాగ్జిమమ్ సీట్లు గెలుచుకుంటే అధిష్టానం దగ్గర రేవంత్ ఇమేజి పెరుగుతుంది. అలాగే పార్టీలోని తన ప్రత్యర్థులు వీకైపోతారు. ఇక కేసీయార్ కోణంలో చూస్తే అత్యధిక సీట్లు గెలుచుకుంటే రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఎంతోకొంత గౌరవం దక్కుతుంది. లేకపోతే కేసీయార్ ను ఎవరు పట్టించుకోరు.

ఇప్పటికే జాతీయస్ధాయిలో కేసీయార్ ను ఎవరు పట్టించుకోవటంలేదు. క్రెడిబులిటి లేకపోవటమే కేసీయార్ కు పెద్ద సమస్యగా మారిపోయింది. పార్లమెంటు ఎన్నికల్లో ఇపుడున్న 8 సీట్లు కూడా దక్కించుకోకపోతే ముందు ముందు కష్టాలు పెరిగిపోతాయి. పార్టీలోని ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వలసలను నివారించాలన్నా ఎంపీ సీట్లు ఎక్కువగా గెలుచుకోవాల్సిన అవసరం కేసీయార్ కుంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.