తెలంగాణా సేఫ్ జోన్ అయిపోయిందా ?

క్యాంప్ పాలిటిక్స్ కు తెలంగాణా సేఫ్ జోన్ అయిపోయినట్లుంది. ముఖ్యంగా నాన్ ఎన్డీయే పార్టీలకు తమ రాష్ట్రాల్లో ఏ సమస్యలు వచ్చినా వెంటనే తెలంగాణాయే గుర్తుకొస్తోంది. ఈమధ్యనే జార్ఖండ్ ఎంఎల్ఏలతో మూడు రోజులు తెలంగాణాలోనే క్యాంపు నడిచింది. ఇపుడు బీహార్లోని కాంగ్రెస్ ఎంఎల్ఏలను ఇక్కడికే తరలించారు. ఎన్డీయే ప్రభుత్వం దెబ్బకు నాన్ ఎన్డీయే ప్రభుత్వాలు చిగురుటాకుల్లాగ వణికిపోతున్న విషయం తెలిసిందే. నాన్ ఎన్డీయే ప్రభుత్వాలను ఏదో కారణంతో కూల్చేయటం లేదా అస్ధిరపరచటమే టార్గెట్ గా బీజేపీ పనిచేస్తోంది.

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ అవినీతిలో కూరుకుపోవటంతో ఈడీ అరెస్టుచేసింది. ఆయన స్ధానంలో చంపా సోరేన్ ను పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గా ఎన్నుకున్నది. అయితే తమ పార్టీ ఎంఎల్ఏలను బీజేపీ ఎక్కడ తన్నుకుపోతుందో అన్న భయంతో జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంఎల్ఏలను ముఖ్యమంత్రి చంపా క్యాంపు నిర్వహించాలని అనుకున్నారు. అనుకున్నవెంటనే చంపాకు గుర్తుకొచ్చింది తెలంగాణాయే. తమ 30 మంది ఎంఎల్ఏలను కాపాడుకోవటమే చంపాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇండియా కూటమిలో భాగంగా కాబట్టి జేఎంఎం ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అగత్యం కాంగ్రెస్ మీదపడింది. అందుకనే వెంటనే ఎంఎల్ఏలను తెలంగాణాకు తరలించారు.

సోమవారం రాంచిలో బలనిరూపణ ఉంది కాబట్టి క్యాంపులోని ఎంఎల్ఏలందరినీ మళ్ళీ రాంచికి తరలించారు. ఇది అయిపోగానే వెంటనే బీహార్లో సమస్య ముంచుకొచ్చింది. ఇండియా కూటమి నుండి నితీష్ కుమార్ బయటకు వెళ్ళిపోయి ఎన్డీయేలో చేరిన విషయం తెలిసిందే. దాంతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీష్ బలనిరూపణ చేసుకోవాల్సొచ్చింది. అసెంబ్లీ వేదికగా బలనిరూపణకు రంగం సిద్ధమైంది.

అందుకని కాంగ్రెస్ కు చెందిన 22 మంది ఎంఎల్ఏలను కాపాడుకోవాల్సిన అవసరం అధిష్టానంపై పడింది. దాంతో వెంటనే అందరిని తెలంగాణాకు తరలించారు. ఇబ్రహింపట్నంలోని మంచాల మండలంలోని ఒక రిసార్ట్స్ లో వీళ్ళందరినీ ఉంచారు. అలాగే ఆర్జేడీ ఎంఎల్ఏలను ఆపార్టీ అధినేతలు క్యాంపుకు తరలించారు. రేపు ఢిల్లీలో ఆప్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా ఇదే పరిస్ధితి ఎదురైతే వాళ్ళని కూడా తెలంగాణాకే తరలించేట్లున్నారు. మొత్తానికి నాన్ ఎన్డీయే ప్రభుత్వాలకు తెలంగాణా సేఫ్ జోన్ అయిపోయినట్లుంది.