కాంగ్రెస్ కుంభస్ధలం కొట్టబోతోందా ?

గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలిసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిని తాను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని అందులోను అధికారిక వ్యవహారాల కోసమే అని ఆమె చెప్పారు. అయితే ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీల్లో ఎవరు నమ్మటంలేదు. రేవంత్ ను ఇపుడు బీఆర్ఎస్ తరపున ప్రజాప్రతినిధులు ఎవరు కలిసినా సంచలనమైపోతోంది.

కారణం ఏమిటంటే కచ్చితంగా ఏదోరోజు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. మొదట్లో రాజేంద్రనగర్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత మెడక్ జిల్లాలోని నలుగురు ఎంఎల్ఏలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్తా ప్రభాకరరెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావులు ముఖ్యమంత్రిని కలిశారు. దాంతో బీఆర్ఎస్ లో సంచలనమైపోయింది. తాము నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కలిసినట్లు నలుగురు ఎంఎల్ఏలు చెప్పుకున్నా ఎవరు నమ్మలేదు. వెంటనే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రిని కలవటతో కలకలం రేగింది.

ముహూర్తం చూసుకుని పై ఐదుగురు ఎంఎల్ఏలు కాని లేకపోతే వీరిలో కొంతమందైనా సరే కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. సరిగ్గా ఈ సమయంలోనే మేయర్ విజయలక్ష్మి ముఖ్యమంత్రిని కలవటంతో ప్రధాన ప్రతిక్షంలో గందరగోళం పెరిగిపోతోంది. ఇపుడు జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కు 58 మంది కార్పొరేటర్లు, బీజేపీకి 48, ఎంఐఎంకు 44 మంది కార్పొరేటర్లున్నారు. కాంగ్రెస్ కు ఇద్దరు మాత్రమే ఉన్నారు.

అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లలో చీలికరావటం ఖాయమనే టాక్ పెరిగిపోతోంది. మేయర్ తో కలిసి 28 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని ప్రచారం పెరిగిపోతోంది. అదే జరిగితే మద్దతు ఇవ్వటానికి ఎంఐఎం ఎలాగూ సిద్ధంగానే ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కుంభస్ధలాన్ని బద్దలు కొట్టినట్లే అనుకోవాలి. ఇప్పటికే సుమారు 18 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తోంది. కాబట్టి తొందరలోనే జీహెచ్ఎంసీలో కూడా హస్తం జెండా ఎగరటం ఖాయమనే అనుకుంటున్నారు. ఏమి జరిగినా కేసీయార్ ఏమీ అనేందుకు లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నపుడు ఈ కంపును మొదలుపెట్టిందే కేసీయార్ కాబట్టి.