ఆ మంత్రి ఆప‌శోపాలు..!

జిల్లా ఒక్క‌టే అయినా.. నియోజ‌క‌వ‌ర్గం కొత్త కావ‌డం.. పైగా పార్టీ అధిష్టానం అక్క‌డే పోటీ చేయాల‌ని ఆదే శించ‌డంతో వైసీపీ నాయకుడు, మంత్రి చెల్లుబోయిన వేణు ఆప‌శోపాలు ప‌డుతున్నారు. దీనికి కార‌ణం.. త‌న‌కు కేటాయించిన నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా టీడీపీ కేడ‌ర్‌లో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. పైగా ఇక్క‌డ ఆ పార్టీ సీనియ‌ర్ మోస్ట్ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. 2019 ఎన్నిక‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచిన సంద‌ర్భంలోనూ ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కారు.

అదే.. రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం. అయితే, ఈ ద‌ఫా మంత్రి వేణుకు స్థానచ‌ల‌నం క‌ల్పించిన పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. ఆయ‌న‌ను సొంత నియోజ‌క‌వ‌ర్గం, పైగా రెండు సార్లు గెలిచిన స్తానం రామ‌చంద్ర‌పురం నుంచి అక్క‌డ‌కు త‌ర‌లించారు. ఈ ప‌రిణామం త‌న‌కు ఇబ్బందిగానే ఉన్న‌ప్ప‌టికీ.. పైకిచెప్ప‌లేక‌.. జ‌గ‌న్ ఆదేశాలు కాద‌న‌లేక మంత్రి వ‌ర్యులు స‌త‌మ‌తం అవుతున్నారు. దీంతో త‌న‌దైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రామ‌చంద్ర‌పురానికే ప‌రిమితమైన త‌న కార్యాల‌యాన్ని రాజ‌మండ్రి రూర‌ల్‌కు మార్చుకున్నారు. త‌న కేడ‌ర్‌ను రోజూ.. అక్క‌డ తిప్పుతున్నారు. వారికి అయ్యే ఖ‌ర్చులు కూడా భ‌రిస్తున్నారు. అంతేకాదు.. తాను కూడా వారానికి 4 రోజులు అక్క‌డే మ‌కాం వేసేలా.. పెద్ద భ‌వ‌నాన్ని అద్దెకు తీసుకున్నారు. ఉద‌యం పూట మార్కింగ్ వాక్ పేరుతో ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. వారితో మాట‌లు క‌లుపుతున్నారు. త‌న పూర్వీకులు ఇక్క‌డే ఉండేవార‌ని కూడా చెబుతున్నారు.

ఇక‌, మ‌ధ్యాహ్న స‌మ‌యానికి లంచ్ ఏర్పాటు చేసి.. కుల సంఘాల‌కు విందు ఇస్తున్నారు. అయితే.. ఇదంతా కూడా.. సైలెంట్ గా చేసేస్తున్నారు. నేనున్నాను.. మీకేం కావాలో చెప్పండి! అంటూ.. వారిని మ‌చ్చిక చేసుకుంటున్నారు. అయితే.. ఎక్క‌డా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే పై విమ‌ర్శ‌లు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి వైసీపీ నాయ‌కులు ప్ర‌తిప‌క్షంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కానీ , వేణు ఈ పంథాతో ఉప‌యోగం లేద‌ని అనుకుని.. త‌న గురించి,.. మంత్రిగా తాను సాధించిన విష‌యాల‌ను కూడా ప్ర‌చారం చేస్తున్నారు. మొత్తానికి బాగానే శ్ర‌మిస్తున్నా.. టీడీపీ కంచుకోట‌లో పాగా వేయ‌డంపై మాత్రం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.