కేసీఆర్, జగన్ ల పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ల మధ్య గ్యాప్ ఉందని టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ తో పాటు దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని, పోతిరెడ్డిపాడు నుంచి నీటిని ఆంధ్రాకు నీటిని తరలించుకుపోయారని రేవంత్ షాకింగ్ ఆరోపణలు చేశారు. ఇక, ఆయన తనయుడు జగన్… తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వచ్చి పంచభక్ష పరమాన్నాలు తిన్నారని, కృష్ణా నీటిపై దాదాపు 6 గంటల పాటు చర్చించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 8 టీఎంసీల నీటిని తరలించేందుకు అనుమతి తీసుకున్నారని ఆరోపించారు.

కేసీఆర్ హయాంలోని గత ప్రభుత్వం ఏపీకి దాసోహం అయిందని, తెలంగాణ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఏపీ పోలీసుల సాయంతో జగన్ ఆక్రమించుకోవాలనుకుంటే కేసీఆర్ మారు మాట్లాడలేదని విమర్శించారు. దమ్ముంటే ఇప్పుడు రావాలని జగన్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ల పాపాలను కాంగ్రెస్ పై నెట్టేస్తున్నారని, రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టుల వ్యవహారం కేంద్రానికి గత తెలంగాణ ప్రభుత్వం అప్పగించిందని గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ప్రతి అక్షరం తనను అడిగిన తర్వాతే రాశారని కేసీఆర్ గతంలో అన్నారని రేవంత్ చెప్పారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయానికి కేసీఆర్ పునాదిరాయి వేశారని, ఆ చట్టానికి బాధ్యతను కేసీఆర్, కేశవరావు తీసుకోవాలని అన్నారు. నీటి పంపకాల్లో తెలంగాణ హక్కు వాటాను గత ప్రభుత్వం ఎందుకు అడిగి తీసుకోలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్ కు ధారాదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డారు.