పాపం కుమారి ఆంటీ.. ఎవరికి వారు ఆడేసుకుంటున్నారే!

సోషల్ మీడియాలో పేరు ప్రఖ్యాతులు మోతాదు మించితే పరిస్థితి ఎంతలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా నిలుస్తోంది కుమారి ఆంటీ ఎపిసోడ్. రోడ్డు పక్కన తాత్కాలిక ఏర్పాటుతో ఫుడ్ అమ్ముకునే ఆమెకు పెద్ద కష్టమే వచ్చింది. పేరుకు రోడ్డు పక్కనే కానీ.. శుచిగా.. శుభ్రంగా.. కమ్మని ఇంటి రుచితో.. సరసమైన ధరలకు ఫుడ్ అందించే కుమారి ఆంటీ ఫుడ్ మీద యూట్యూబ్ వీడియోలు.. వెబ్ చానళ్లు ఇంటర్వ్యూల పుణ్యమా అని ఆమెకు పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నాయి.

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ లో రోడ్డు పక్కన పేరు లేని ఫుడ్ స్టాల్ కు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ అని పేరు పేట్టేయటం.. ఆమె దగ్గర ఫుడ్ తినేందుకు వందలాది మంది రావటంతో ఆమె వ్యాపారం మూడు బిర్యానీలు.. ఆరు చికెన్ కర్రీలు అన్నట్లుగా సాగుతోంది. చూస్తుండగానే ఆమె యూట్యూబ్ లో ఫేమస్ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే చిక్కు వచ్చి పడింది. సైబరాబాద్ పోలీసులు కొందరు వచ్చి ఆమె ఫుడ్ బిజినెస్ పెట్టొద్దని.. ఆమె కారణంగా ట్రాఫిక్ ఆగిపోతుందంటూ ట్రాఫిక్ పోలీసులు ఆమె వ్యాపారాన్ని ఆపేశారు.

ఈ సమయంలో యూట్యూబ్ చానళ్లు.. సోషల్ మీడియాలు ఎంట్రీ ఇవ్వటం.. ఆమె పై పోలీసుల జులం సరికాదంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో.. వాట్సాప్ గ్రూపుల్లో.. యూట్యూబ్ చానళ్లలో ప్రచారం కావటం.. ఆ వాదన కాస్తా వైరల్ కావటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె హాట్ టాపిక్ గా మారారు. ఆమె ఇష్యూలోకి ఎంట్రీ ఇచ్చిన ఏపీ రాజకీయ పార్టీల ప్రస్తావనతో వ్యవహారం ముదిరింది. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుగజేసుకొని.. పోలీసులకు డైరెక్షన్ ఇచ్చేశారు. కుమారి ఆంటీని ఇబ్బంది పెట్టొద్దని.. ఆ మాటకు వస్తే రోడ్డు పైన వ్యాపారాలు చేసుకునే వారి విషయంలో మానవత్వంతో ఆలోచించాలన్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏదో ఒక రోజు కుమారి ఆంటీ స్టాల్ వద్దకు సీఎం రేవంత్ వస్తారంటూ ఆయన కార్యాలయంలో పీఆర్వోగా వ్యవహరిస్తున్న అయోధ్య రెడ్డి ఒక మెసేజ్ పెట్టటంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఇంతవరకు ఓకే.. ఇప్పుడు ఎదురైన సమస్యే పెద్దదిగా మారింది. తాజాగా శనివారం ఆమె స్టాల్ వద్దకు వచ్చిన కొందరు నిరుద్యోగులు జీవో 46ను రద్దు చేయాల్సిందిగా సీఎం రేవంత్ కు తమ తరఫున చెప్పాలంటూ కుమారి ఆంటీని చుట్టుముట్టేశారు. దీంతో అవాక్కు కావటం ఆమె వంతైంది.

భోజనం.. బిర్యానీలు.. కూరలు అమ్ముకోవటానికి స్టాల్ ఏర్పాటు చేస్తే.. ఇలా వచ్చి వినతిపత్రాలు ఇవ్వటం.. ముఖ్యమంత్రి రేవంత్ వచ్చినప్పుడు తమ తరఫు ఒక మాట సీఎం చెవిలో వేయాలంటూ అప్లికేషన్లు ఇస్తున్న వైనం చూస్తే.. ఏదో పెద్ద ఎత్తున టార్గెట్ చేసినట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జీవో నెంబరు 46 రద్దు చేయాలన్న వారి వినతులకు స్పందిస్తున్న ఆమె.. తనకేమీ తెలీదని తమ వ్యాపారం తమను చేసుకోనివ్వమని బ్రతిమిలాడుతున్నా ఆమె మాటను ఎవరూ పట్టించుకోవటం లేదు. ఎవరికి వారు తమ డిమాండ్లను ఆమె ముందు పెట్టి వెళుతున్న వైనంతో ఆమె బిక్కముఖం వేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాదిరి.. కుమారి ఆంటీని ఇంత భారీగా ర్యాగింగ్ చేయాల్సిన అవసరమేంటి? వీరి వెనుక ఎవరున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.