కాంగ్రెస్‌కు కంట్లో న‌లుసు..

Mamata
Mamata Banerjee addressing a rally in Kolkata on the occasion of the TMCP foundation day | Salil Bera

రాజ‌కీయాల్లో త‌న‌కంటూ.. ప్ర‌త్యేక ముద్ర వేసుకున్నారు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. అంద‌రూ ఆమెను దీదీ అని పిలుచుకుంటారు. అయితే. ఆమె ప్ర‌త్యేక‌త ఏంటంటే..ఎప్పుడు ఎటు వైపు నిల‌బ‌డ‌తారో.. ఎప్పుడు ఎవ‌రిని పొగుడుతారో చెప్ప డం క‌ష్టం. ఏనిముషానికి ఆమె మ‌న‌సు, నోరు.. ఎటు వైపు మ‌లుపు తిరుగుతాయో కూడా చెప్ప‌డం మ‌రీ క‌ష్టం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. కాంగ్రెస్ పార్టీని భేష్ అంటూ.. కొనియాడిన దీదీ.. ఇటీవ‌ల కాలంలో తిట్టి పోస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక విజ‌ను పాడూ ఏమీ లేవ‌ని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇక‌, ఇప్ప‌డు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతూ ఏకంగా స‌వాళ్లే రువ్వారు దీదీ. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి క‌నీసంలో క‌నీసం 40 సీట్లు కూడా రాబోవ‌ని ఆమె చెప్పారు. అంతేకాదు.. అల‌హాబాద్‌, వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసి.. గెలిచి చూపించ‌గ‌లరా? అని స‌వాల్ రువ్వారు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ బీజేపీ గెలిచింది. వార‌ణాసి ఏకంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ 2014, 2019 ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కారు. ఇక‌, యూపీలోని అల‌హాబాద్‌లోనూ బీజేపీ నేత శ్యామా చ‌ర‌ణ గుప్తా విజ‌యం సాధించారు. ఈ రెండు కూడా బీజేపీకి అత్యంత బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాలు. వీటిలోనే కాంగ్రెస్ గెలిచి చూపించాల‌ని మ‌మ‌త స‌వాల్ రువ్వారు.

ఎందుకింత అక్క‌సు?

కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్‌తో మ‌మ‌త ఎందుకు ఇలా విభేదిస్తున్నార‌న్న‌దానికి కార‌ణం వెతికిచూస్తే.. అత్యంత చిన్న‌గానే ఉంది. కానీ, మ‌న‌సులో ఆమె బాధ వేరేగా ఉండ‌డంతో ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. ఆమె చెబుతున్న కార‌ణం.. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం భార‌త్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నారు. ఇది మ‌మ‌త అధీనంలో ఉన్న ప‌శ్చిమ బెంగాల్‌లో సాగుతోంది. అయితే.. ఈ యాత్ర రాష్ట్రంలోకి ప్ర‌వేశించిన‌ప్పుడు త‌న‌కు చెప్ప‌లేద‌న్న‌ది ఆమె చెబుతున్న కార‌ణం. కానీ, కాంగ్రెస్ నేత‌లు మాత్రం ముందుగానే డీజీపీకి, సీఎస్‌కు స‌మాచారం ఇచ్చామ‌ని అంటున్నారు.

ఇక‌, మ‌మ‌త మ‌న‌సులో ఉన్న కార‌ణం చూస్తే.. ఆమె ఇండియా కూట‌మిలో ఉన్న‌ప్పుడు(ఇప్పుడు లేరు) దీనికి క‌న్వీన‌ర్ కావాల‌ని అనుకున్నారు. త‌ద్వారా.. మోడీని ఓడిస్తే.. ప్ర‌ధాని కావాల‌నేది ఆమె ఆకాంక్ష. కానీ, క‌ర్ణాట‌క‌, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోక వ‌చ్చాక‌.. ఇండియా కూట‌మికి తామే నేతృత్వం వ‌హిస్తామ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. ఈ క్ర‌మంలోనే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖ‌ర్గేను రంగంలోకిదింపింది. ఇదీ.. అస‌లు అక్క‌సు. ఈ కార‌ణంగానే మ‌మ‌త చిర్రెత్తిపోతున్నారు. ఒక్క సీటు కూడా ఇచ్చేది లేద‌న్నారు. ఇక‌, ఇదే కార‌ణంగా బిహార్ సీఎం నితీష్ కూడా కాంగ్రెస్‌తో తెగ‌తెంపులు చేసుకుని .. బీజేపీ పంచ‌న చేరిన విష‌యం తెలిసిందే.