కాంగ్రెస్ లో హాట్ సీటిదేనా ?

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీపై సీనియర్ నేతలు, వాళ్ళ వారసులు దృష్టి కేంద్రీకరించారు. ఉన్న 17 పార్లమెంటు సీట్లలో టికెట్ కోసం పార్టీలో బాగానే పోటీ మొదలైపోయింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అన్నీ నియోజకవర్గాల్లోకి ఖమ్మం పార్లమెంటు సీటే చాలా హాట్ సీటట. ఎందుకంటే ఇక్కడ నామినేషన్ వేస్తే చాలు కాంగ్రెస్ గెలుపు గ్యారెంటీ అనే ప్రచారం ఉంది కాబట్టే. నిజానికి ఖమ్మం పార్లమెంటు సీటు అంటేనే కాంగ్రెస్ గ్యారెంటీగా గెలిచే సీట్లలో మొదటిదనే చెప్పాలి.

పార్లమెంటు నియోజకవర్గం చరిత్రను చూస్తే అత్యధిక సార్లు కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. ప్రతిపక్షాలు ముఖ్యంగా టీడీపీ, సీపీఎం గెలిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల్లో తిరుగుబాట్లు, అసంతృప్తుల కారణంగా మాత్రమే ఇతర పార్టీలు గెలిచాయన్నది అందరికీ తెలిసిందే. అందుకనే ఈ సీటులో పోటీచేయటానికి పోటీ అంతకంతకు పెరిగిపోతోంది. ప్రస్తుత విషయానికి వస్తే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జిల్లాను స్వీప్ చేసేసిందనే చెప్పుకోవాలి. జిల్లాలోని పది సీట్లలో తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు మంచి మెజారిటితో గెలిచారు.

ఇందులో ఖమ్మంపార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీలను కాంగ్రెస్ స్వీప్ చేసేసింది. కాబట్టి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరపున ఎవరు నామినేషన్ వేసినా గెలుపు గ్యారెంటీ అని అర్ధమైపోయింది. అందుకనే పోటీచేయటం కోసం సీనియర్లు చాలామంది పోటీలు పడుతున్నారు. విచిత్రం ఏమిటంటే హైదరాబాద్ కు చెందిన సీనియర్ నేత వీ హనుమంతరావు కూడా ఖమ్మం పార్లమెంటులో పోటీచేయాలని అనుకుంటున్నారు.

ఇప్పటికే డిప్యుటి సీఎం భట్టి విక్రమార్క భార్య ఆనందిని, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు, తుమ్మల నాగేశ్వరరావు కొడుకు కూడా పోటీకి రెడీ అయిపోయారు. అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, రెండుసార్లు గెలిచిన రేణుకా చౌదరి కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. లోకల్ అనుకున్న దుర్గాప్రసాద్, పొంగులేటి, తుమ్మల, భట్టి కుటుంబాల్లోనే ఇంత పోటీ ఉంది. వీళ్ళకి అదనంగా వీహెచ్, రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన రేణుక ఉండనే ఉన్నారు. మరి చివరకు టికెట్ ఎవరిని వరిస్తుందో చూడాలి.