నేతలకు కేసీయార్ షాకిచ్చారా ?

Maharastra

మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు కేసీయార్ షాకులమీద షాకులిస్తున్నారట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేసీయార్ కు పెద్ద షాకనే చెప్పాలి. తనపైన తాను విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కేసీయార్ అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తాపడ్డారు. ఎన్నికల్లో ఓడిన రెండు రోజునే బాత్ రూములో పడితే తుంటి ఎముక విరిగింది. దాంతో ఆపరేషన్ చేయించుకున్న కేసీయార్ ఇంటికే పరిమితమైపోయారు. రెండు మూడు రోజులుగానే బయటకు వస్తున్నారు. తొందరలోనే పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి కదా అందుకనే ప్రచారానికి రెడీ అవుతున్నారు.

ప్రమాదం తర్వాత ఇపుడిప్పుడే బయటకు వస్తున్న కేసీయార్ పార్లమెంటు ఎన్నికల్లో ఎంత యాక్టివ్ గా ఉంటారో ఎవరు చెప్పలేరు. ఈ విషయాలను పక్కనపెట్టేస్తే దేశంలో బీఆర్ఎస్ ను విస్తరించాలని వేసుకున్న ప్లాన్లన్నీ తల్లకిందులైపోయింది మాత్రం వాస్తవం. ఇందుకు మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. తెలంగాణా తర్వాత కేసీయార్ బాగా దృష్టిపెట్టిన రాష్ట్రం మహారాష్ట్రయే. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, నాందేడ్, లాతూర్, కొల్హాపూర్, కందార్ లోహ జిల్లాలపై ఎక్కవగా దృష్టిపెట్టారు.

పై జిల్లాల్లో బహిరంగసభలు కూడా నిర్వహించారు. పెద్దఎత్తున సభ్యత్వ నమోదు కూడా చేశారు. ఇతర పార్టీల్లో నుండి మాజీ ఎంఎల్ఏలు, మాజీ ఎంపీలను చేర్చుకున్నారు. పంచాయితి ఎన్నికల్లో అభ్యర్ధులను దించి చాలా హడావుడి చేశారు. మొత్తానికి 200 పంచాయితీల్లో కొన్ని సర్పంచ్ పదవులతో పాటు చాలాచోట్ల వార్డులను బీఆర్ఎస్ గెలుచుకున్నది. తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయటానికి అభ్యర్ధులను ఎంపిక చేయాల్సిన కేసీయార్ ఇపుడు మహారాష్ట్రను పట్టించుకోవటంలేదట. ఎన్నికల విషయమై మాట్లాడేందుకు అక్కడి నేతలు ఎంతమంది ఎన్నిసార్లు ఫోన్లు చేసినా కేసీయార్ మాట్లాడటంలేదని తెలిసింది.

అలాగే మరికొందరు హైదరాబాద్ కు వచ్చినా అపాయిట్మెంట్లు కూడా ఇవ్వటంలేదట. మహారాష్ట్ర ఇన్చార్జిగా కేసీయార్ నియమించిన కల్వకుంట్ల వంశీధరరావు కూడా ఎవరికీ ఫోన్లో అందుబాటులో లేరట. దాంతో తమ భవిష్యత్తు ఏమిటో అర్ధంకావటంలేదట. కేసీయార్ ను నమ్మి తమ పార్టీలను వదిలేసి బీఆర్ఎస్ లో చేరినందుకు తగిన శాస్తే జరిగిందని ఇపుడు మహా నేతలు నానా గోలచేస్తున్నారట. ఒకపుడేమో తెలంగాణా నేతలను కూడా పక్కనపెట్టేసి అచ్చంగా మహారాష్ట్ర నేతలకే అపాయింట్మెంట్లిచ్చి భేటీలు నిర్వహించిన కేసీయార్ ఇపుడు వాళ్ళకి ఫోన్లు కూడా దొరకటంలేదట.