అక్షరాస్యతలో దిగజారిన ఆంధ్ర

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ వరుసగా రెండో ఏడాది కూడా అగ్ర స్థానంలో నిలవడం గురించి పెద్ద చర్చే జరుగుతోంది రెండు రోజులుగా. దీని తాలూకు క్రెడిట్ కోసం ఇటు అధికార వైకాపా, అటు ప్రతిపక్ష టీడీపీ పార్టీలు కొట్టేసుకుంటున్నాయి. చివరికి తేలిందేమంటే.. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఇచ్చిన ర్యాంకు ఇదని.

దాన్ని బట్టి చూస్తే ఆ క్రెడిట్ చంద్రబాబు సర్కారుకే చెందాలి. ఆ సంగతలా వదిలేస్తే ఇప్పుడు ఈ రెండు పార్టీలూ కొట్టేసుకోవడానికి ఇంకో టాపిక్ దొరికింది. దేశం మొత్తంలో అతి తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఉత్తరాదిన, ఈశాన్య ప్రాంతంలో ఎన్నో వెనుకబడ్డ రాష్ట్రాలున్నాయి. వాటన్నింటినీ వెనక్కి నెట్టి ఏపీ ఈ జాబితాలో అట్టడుగున నిలవడం దారుణమైన విషయం.

జాతీయ అక్షరాస్యత శాతం సగటు 77.7 శాతంగా ఉండగా.. ఏపీలో అక్షరాస్యత రేటు 66.4 శాతం మాత్రమే కావడం గమనార్హం. గతంలో ఈ జాబితా విడుదల చేసినపుడల్లా బీహార్ అట్టడుగున కనిపించేది. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యాక ఎంతో పురోగతి సాధించిన ఆ రాష్ట్రం ఇప్పుడు 72.8 శాతం అక్షరాస్యతతో ఏపీని వెనక్కి నెట్టి పైకి వెళ్లింది. తెలంగాణ 70.9 శాతం అక్షరాస్యతతో ఏపీ కన్నా కొంచెం మెరుగ్గా.. చివరి నుంచి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఈశాన్య రాష్ట్రం అయిన అసోం 85.5 శాతం అక్షరాస్యతతో జాతీయ సగటును దాటి మెరుగైన స్థానంలో నిలిచింది. ఎప్పట్లాగే కేరళ 96.2 శాతం అక్షరాస్యతతో అగ్ర స్థానం దక్కించుకుంది.

ఇంతకీ ఈ లెక్కలు ఎప్పటివో చెప్పలేదు కదా. 2017-18 వార్షిక సంవత్సరం నాటివి. అప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వమే. దీనికి బాధ్యత ముందున్న ప్రభుత్వాలు కూడా తీసుకోవాల్సిందే కానీ.. దీన్ని బట్టి 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అక్షరాస్యత శాతం పెంచడానికి పెద్దగా ప్రయత్నం చేయలేదని స్పష్టమవుతోంది. మరి ఈ విషయంలో నిరుడు అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు పనితీరు ఎలా ఉందన్నది భవిష్యత్తులో వెల్లడయ్యే జాబితాల్ని బట్టి తెలుస్తుంది.