కోదండ‌రాంకు షాక్‌.. హైకోర్టు నిర్ణ‌యంతో సంచ‌ల‌నం!

తెలంగాణ ఉద్య‌మ నాయ‌కుడు, ప్ర‌ముఖ విద్యావేత్త ప్రొఫెస‌ర్ కోదండ‌రాంకు భారీ షాక్ త‌గిలింది. ఈయ నతోపాటు.. మైనారిటీ నాయకుడు, అమీరుల్లాఖాన్‌కు కూడా తీవ్ర ఎదురు దెబ్బే త‌గిలింద‌ని అంటున్నా రు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించిన త‌ర్వాత‌.. ప‌దేళ్ల‌కు కోదండ‌రాంకు కీల‌క‌మైన స్థానం దక్కింద‌ని అంద‌రూ అనుకున్నారు. ఆయ‌న‌కు గ‌త ప్ర‌భుత్వం ఇవ్వ‌ని గౌర‌వం ప్ర‌స్తుత సీఎం, కాంగ్రెస్ ప్ర‌భుత్వ సార‌థి రేవంత్‌రెడ్డి ఇస్తున్నార‌ని భావించారు.

అదే.. గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానం. కోదండ రామ్‌తో పాటు.. మైనారిటీ నాయ‌కుడు అమీరుల్లాఖాన్ ల‌నుఈ కోటాలో మండ‌లికి పంపించాల‌ని రేవంత్ ప్లాన్ చేసుకున్నారు. దీనికి దాదాపు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై కూడా ఆమోదం తెలిపారు. వీరి ఎంపిక‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇక‌, వీరి ప్ర‌మాణ‌మే త‌ర‌వాయి అనుకున్నారు. కానీ, ఇంత‌లోనే.. హైకోర్టు వీరి ప్ర‌మాణానికి బ్రేకులు వేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. వ‌చ్చే నెల 8వ తేదీ వ‌ర‌కు వీరితో ప్ర‌మాణం చేయించొద్దంటూ.. కోర్టు పేర్కొంది.

ఏం జ‌రిగింది?

రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీరుల్లా ఖాన్‌లను కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. వాస్త‌వానికి ఈ కోట కింద ఎప్పుడో ఎమ్మెల్సీల ఎంపిక పూర్తి కావాల్సి ఉంది. కానీ, అప్ప‌ట్లో బీఆర్ ఎస్ స‌ర్కారు పంపిన వారికి గ‌వ‌ర్నర్ ఆమోదం తెల‌ప‌లేదు. దీంతో అప్ప‌ట్లో ఆ వ్య‌వ‌హారం తీవ్ర వివాదానికి దారితీసింది. ఏకంగా కోర్టుకు కూడా వెళ్లింది. ఇప్ప‌టికీ.. అది విచార‌ణ ద‌శ‌లోనే ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఎమ్మెల్సీ వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ నాయకులు కోర్టుకు వెళ్లారు.

బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్ర‌యించారు. గతంలో తాము వేసిన పిటిషన్‌పై విచారణ తేలే వరకు ప్ర‌స్తుతం గ‌వ‌ర్న‌ర్ కోటా కింద‌ ఎమ్మెల్సీల నియామకాలు ఆపాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై తాజాగా జ‌రిపిన విచార‌ణ‌లో హైకోర్టు కీలక ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ విష‌యంలో స్టేట‌స్ కో పాటించాల‌ని పేర్కొంది. దీంతో కోదండ‌రాం ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లిన‌ట్టు అయింది. కాగా, ఆయ‌న‌ను మండ‌లికి తీసుకువ‌చ్చి.. మంత్రి చేయాల‌ని సీఎం రేవంత్ భావించిన‌ట్టు చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.