ష‌ర్మిల పై వైసీపీ.. తగ్గేదేలే

ఏపీ అధికార పార్టీ వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న నుంచి బ‌య‌ట ప‌డింది. ఇప్ప‌టి వ‌రకు ప్ర‌తిప‌క్షాలుగా ఉన్న టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీల నుంచి ఈ పార్టీకి రాజ‌కీయ సెగ బాగానే త‌గిలింది. ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించడం నుంచి సీఎం జ‌గ‌న్ ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేయ‌డం వ‌ర‌కు ఆయా పార్టీలు తీవ్ర విమ‌ర్శ‌లే చేశాయి. ఇక‌, ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌పై కూడా.. తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించాయి. ముఖ్యంగా ఈ జాబితాలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించి.. ప్ర‌జ‌ల్లో వైసీపీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేశారు.

ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా వైసీపీని గ‌ద్దె దింపే వ‌ర‌కు నిద్ర‌పోన‌న్న‌ట్టుగానే రాజ‌కీయాలు చేస్తున్నారు. అదేస‌మ‌యంలో బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి.. మ‌ద్యం, ఇసుక‌, న‌కిలీ ఓట్లు అంటూ.. రోడ్డెక్కారు. ఇవ‌న్నీ రాజ‌కీయాల్లో సాదార‌ణమే అనుకున్న వైసీపీ.. వారికి త‌గిన విధంగా చెక్ పెడుతూ.. వ‌చ్చింది. తాము చేస్తున్న సంక్షేమ‌.. అభివృద్ది కార్య‌క్ర‌మాలే త‌మ‌ను ర‌క్షిస్తాయ‌ని.. విప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను ప్ర‌జ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోర‌ని భావిస్తూ.. వ‌చ్చింది. అయితే.. ఇప్పుడు వైసీపీ ఊహించ‌ని విధంగా జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల రంగంలో దిగారు.

ఇదే పెద్ద‌చిక్కుగా మారింది. పొరుగు పార్టీ నేత‌లు ఏం చెప్పినా.. కొట్టి పారేసేందుకు, రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు చేసేందుకు వైసీపీ ఒక లైన్ ఎంచుకుని ఇప్ప‌టి వ‌ర‌కు ముందుకు సాగితే.. ఇప్పుడు ష‌ర్మిల రూపంలో సొంతింటి నుంచే సెగ ప్రారంభమైంది. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు.. చంద్ర‌బాబు చేసిన విమ‌ర్శ‌లు ఎవ‌రు ప‌ట్టించుకుంటారు..? ఆయ‌న గ‌త ఐదేళ్ల‌లో ఎందుకు సంక్షేమ చేయ‌లేదు..? అని ఎదురు దాడి చేస్తూ వ‌చ్చారు. ఒక‌ర‌కంగా.. ఆయ‌న‌ను పెద్ద‌గా వైసీపీ నేత‌లు ప‌ట్టించుకోలేదు. వ‌య‌సు అయిపోయింద‌ని.. కొడుకును ముఖ్య‌మంత్రి చేసుకోవ‌డం త‌పిస్తున్నార‌ని.. ఇలా వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తూ వ‌చ్చారు.

కానీ.. ష‌ర్మిల ఎంట్రీతో అనూహ్యంగా రాజ‌కీయాలు మారిపోయాయి. దీనిని వైసీపీ చూసి చూడ‌న‌ట్టు వ‌దిలేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో ష‌ర్మిల‌కు స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అవ్వాల‌ని నిర్ణ‌యించేసుకుంది. ఈ క్ర‌మంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ష‌ర్మిల పేరు ఎత్తేందుకు కూడా జంకిన నాయ‌కులు ఇప్పుడు రోడ్డెక్కారు. ఆమెపై వ్యంగ్యాస్త్రాలు దూస్తున్నారు. ఇక‌, వ‌చ్చే రోజుల్లో వ్య‌క్తిగ‌తంగానూ టార్గెట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్ప‌టికే పేర్ని నాని వంటి వారు.. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు సంధించారు. అంటే.. చంద్ర‌బాబును ఎదుర్కొన్న దానికంటే.. కూడా.. ష‌ర్మిల‌ను వంద రెట్లు ఎక్కువ‌గా టార్గెట్ చేసేందుకు వైసీపీ దూకుడు ప్ర‌ద‌ర్శించ‌నుంద‌నేది స్ప‌ష్ట‌మైంది.