సంతాప తీర్మానంలోనూ రాజకీయమేనా?

నిత్యం.. ఇరవై నాలుగంటలూ రాజకీయాలతో మమేకం అయ్యే రాజకీయ నాయకులు సున్నిత అంశాలను ఫీల్ అయ్యే దశ నుంచి.. సందర్భం ఎలాంటిదైనా సరే.. తమ మాటే తప్పించి.. మిగిలినవేమీ పట్టని తీరుతో వ్యవహరిస్తారా? కనీసం కాస్తపాటి మర్యాదను సైతం ప్రదర్శించలేరా? కాలధర్మం చేసిన సభ్యుల సంతాప సందేశాల వేళలోనూ రాజకీయాల్ని పక్కన పెట్టలేరా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో విపక్షానికి చెందిన కొందరు సభ్యుల (అతి తక్కువమంది) అనుచిత వైఖరి విమర్శలకు గురయ్యేలా మారింది.

రాజకీయాల్లో విధానపరంగా తీసుకునే నిర్ణయాల మీద చర్చోపచర్చలు సహజం. అదే సమయంలో అధికార పార్టీ తీరును విపక్షాలు ఎండగట్టటం కూడా మామూలే. అయితే.. అందుకు సమయం.. సందర్భం రెండూ ముఖ్యమన్న విషయాల్ని మర్చిపోతున్న తీరు చూస్తున్నప్పుడు అయ్యో అనుకోకుండా ఉండలేం.

సోమవారం సభలో గతంలో మరణించిన ఆరుగురు మాజీ ఎంపీలకు సభ సంతాపం ప్రకటిస్తున్న సందర్భంలో ఇద్దరు విపక్ష ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేయసాగారు. సభా సంప్రదాయాలకు..మర్యాదలకు ఈ తీరు విరుద్ధం. ప్రభుత్వం తీరు మీద ఎంత ఆగ్రహం ఉన్నా.. సంతాప తీర్మానాలు చదివే సమయంలో కాలధర్మం చేసిన సభ్యులకు మౌనంగా నివాళులు అర్పించటం మర్యాద.

ఆ విషయాల్ని వదిలేసి.. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తున్న ఇద్దరు విపక్ష (కాంగ్రెస్, టీఎంసీ) సభ్యుల మీద లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తీరు పార్లమెంటరీ సంప్రదాయాలకు.. మరణించిన వారి గౌరవానికి భంగం కలిగించే అత్యంత చెడు సంప్రదాయంగా ఆయన హెచ్చరించాల్సి వచ్చింది. అయితే..ఈ అంశం జాతీయ మీడియా మొదలుకొని ప్రాంతీయ మీడియాలోనూ కనిపించని పరిస్థితి. ఇలాంటి తీరు పార్టీ ఏదైనా.. సభ్యులు కాస్తంత మర్యాదతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది మర్చిపోకూడదు.