ష‌ర్మిల నాలుగో కృష్ణుడు: రోజా

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల‌పై వైసీపీ నాయ‌కురాలు, మంత్రి రోజా విమ‌ర్శ‌లు గుప్పించారు. ష‌ర్మిల‌ను ఏపీకి వ‌చ్చిన నాలుగో కృష్ణుడుగా ఆమె పేర్కొన్నారు. హైద‌రాబాద్‌లో ఉంటూ.. ఆమె ఏపీలో రాజ‌కీయాలు చేస్తు న్నారని.. ఎవ‌రెన్ని చేసినా.. వైసీపీ ప్ర‌భంజ‌నాన్ని ఎవ‌రూ ఆప‌లేర‌ని అన్నారు. నాన్ లోకల్ నేతలు జగన్‌పై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల నాలుగో కృష్ణుడు లాంటి వారంటూ రాజో వ్యాఖ్యానించారు.

రాష్ట్రాన్ని విభజించి, వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో ష‌ర్మిల చేరారని విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునే వారు ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నారని రోజా మాటల తూటాలు పేల్చారు. సంక్రాంతి అల్లుళ్ళులాగా వస్తున్నారని ఎద్దేవా చేశారు. “ఆవిడ వేషం కాంగ్రెస్, స్క్రిప్ట్ చంద్రబాబుది” అంటూ విరుచుకుపడ్డారు. షర్మిల మాటలకు విలువ లేదన్నారు.

తెలంగాణలో ష‌ర్మిల సొంతగా పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేదని రోజా వ్యాఖ్యానించారు. అయితే.. అక్క‌డి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఆమెను న‌మ్ముకున్న నాయ‌కుల‌ను న‌డిరోడ్డుపై వ‌దిలేసి వ‌చ్చేసిన త‌ర్వాత‌.. ఇప్పుడు ఆమె మాటలకు అర్థం లేకుండా పోయిందన్నారు. జ‌గ‌న్‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేయ‌డంవ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని వ్యాఖ్యానించారు. దీనివ‌ల్ల ఆయ‌న‌కు మ‌రింత సానుభూతి పెరుగుతుంద‌ని రోజా తెలిపారు.

చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. టీడీపీ, జనసేనకు అభ్యర్థులు లేరని మంత్రి రోజా పేర్కొన్నారు. అందుకే 175 సీట్ల‌లోనూ పోటీ చేయ‌లేక‌.. సీట్లు పంచుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వ‌స్తుంద‌ని అంటూ.. రోజా వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.