నియోజ‌క‌వ‌ర్గాలు మార్చిన నేత‌ల‌కు జ‌గ‌న్ అభ‌యం…!

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి ఏపీ అధికార‌ వైసీపీ .. సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్న విష‌యం తెలిసిందే. మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల వ‌ర‌కు కూడా.. చాలా మందిని మార్చేసింది. వారు ప్ర‌తినిధ్య వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాలు కాకుండా.. వేరే వేరే నియోజ‌క‌వ‌ర్గాల‌కు పంపించేసింది. వీరిలో మంత్రులు కూడా విరివిగానే ఉన్నారు. ఇక‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అదే రేంజ్‌లో ఉన్నారు. అయితే.. వీరంతా కూడా.. కొత్త నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏమేరకు స‌క్సెస్ అవుతామ‌నే బెంగ‌తో ఉన్నారు.

అంతేకాదు.. ఎన్నిక‌ల‌కు రెండు మాసాలు కూడా గ‌డువు లేదని.. ఈ షార్ట్ టైంలో ఎంత వ‌ర‌కు ప్ర‌జ‌ల‌ను క‌లుస్తామ‌ని వారు భావిస్తున్నారు. అదేస‌మ‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక నేత‌కు అల‌వాటు ప‌డిన కేడ‌ర్‌.. ఇప్పుడు అనూహ్యంగా త‌మ వెనుక న‌డ‌వాలంటే కూడా.. క‌ష్ట‌మ‌ని మ‌రికొంద‌రు అనుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే నియోజ‌క‌వ‌ర్గం మార్పును త‌ట్టుకోలేక‌.. ఎంపీ బాల‌శౌరి వంటివారు పార్టీకి రాజీనామా చేశారు. ఇక‌, మ‌రో మంత్రి గుమ్మ‌నూరు జ‌యరాం కూడా.. అదే విధంగా ఉన్నారు.

మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు కూడా.. అధిష్టానానికి రిక్వెస్టులు పంపిస్తున్నారు. త‌మ‌కు త‌మ నియోజ‌క‌వ‌ర్గాలే ఇవ్వాల‌ని కోరుతున్నారు. వీరి అభ్య‌ర్థ‌న‌ల‌తో అధిష్టానం కూడా.. ఇరుకున ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌రిగిన సిద్ద బ‌హిరంగ స‌భ‌లో సీఎం జ‌గ‌న్ ప‌రోక్షంగా ఈ స‌మ‌స్య‌ను ప్ర‌స్తావించారు. నియోజ‌క‌వర్గాలు మార్చిన అభ్య‌ర్థుల‌కు అభ‌యం ప్ర‌సాదించారు. నేనున్నానంటూ.. ఆయ‌న చెప్పుకొచ్చారు. అయితే.. ఎక్క‌డా ఎవ‌రి పేరూ జగ‌న్ చెప్ప‌లేదు.

“ఎవ‌రు ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. అవి వారి సొంత నియోజ‌క‌వ‌ర్గాలు కావ‌ని అనుకుంటున్నా.. ఎలాంటి ఇబ్బందీ లేదు. ఎవరు ఎక్క‌డ నుంచి బ‌రిలో ఉన్నా.. మ‌నం, మ‌న ప్ర‌భుత్వం అమ‌లు చేసిన ప‌థ‌కా లు అంద‌రినీ గెలిపిస్తాయి. దీనికి నాదీ హామీ!” అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఇది పూర్తిగా నియోజ‌కవర్గాలు మార్చిన స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌ను ఉద్దేశించే జ‌గ‌న్ చెప్పార‌ని పార్టీ సీనియ‌ర్లు అంటున్నారు. సో.. వీరంతా గెలుస్తార‌ని.. ఎవ‌రు బెంగ పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ప‌రోక్షంగా జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ని వివ‌రిస్తున్నారు. ఇదీ.. సంగ‌తి.