ఇలా చేస్తే.. వైసీపీకి చెడ్డ పేరు రాదా?


వ‌చ్చే ఎన్నికల్లో విజ‌యం ద‌క్కించుకుని రెండోసారి కూడా అధికారంలోకి రావాల‌ని బావిస్తున్న వైసీపీలో అంత‌ర్గ‌త విభేదాలు.. ఇబ్బంది పెడుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఎస్సీ ఓటు బ్యాంకు త‌మ‌కే అనుకూలంగా ఉంద‌ని చెబుతున్న వైసీపీలో ఆ ఎస్సీ నేత‌లే ఇప్పుడు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. పార్టీలో త‌మ‌కు అవ‌మానాలు త‌ప్ప‌డం లేద‌ని అంటున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అంత‌ర్గ‌తంగా ఆవేద‌న వ్య‌క్తం చేసిన వారు కూడా ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు.

“దళితులు ఎంత పెద్ద పదవిలో ఉన్నా.. వారికి అవమానాలు తప్పడం లేదు.” అని వైసీపీ ఎస్సీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పార్టీలో ప‌రిస్థితికి అద్దం ప‌డుతున్నాయి. పార్టీలో దళితులపై అవమానాలు సహజమైపోయాయంటూ మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు.. పార్టీలో ఎస్సీల‌కు వాల్యూ ఉందా? లేదా? అని ప్ర‌శ్నించారు. ఈ మేరకు ఓలేఖ‌ను పార్టీకి ఆయ‌న పంపించారు.

ఏం జ‌రిగింది?

మడకశిర నియోజకవర్గంలో ఇటీవ‌ల ఎమ్మెల్యే తిప్పేస్వామిని ప‌క్క‌న పెట్టి.. వేరే వారికి ఇంచార్జ్ బాధ్య‌తలు ఇచ్చారు. ఆయ‌న ఒంటెత్తు పోక‌డ‌లు పోతున్నార‌నేది తిప్పేస్వామి ఆవేద‌న. మ‌రో రెండు నెల‌ల పాటు తాను ఎమ్మెల్యేగా ఉంటాన‌ని.. అయిన‌ప్ప‌టికీ.. త‌న‌కు క‌నీస మ‌ర్యాద‌, ప్రొటోకాల్ ప్ర‌కారం గౌర‌వం కూడా ఇవ్వ‌డం లేద‌ని తిప్పేస్వామి అంటున్నారు. తాజాగా నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే అయిన తిప్పేస్వామిని పిల‌వ‌లేదు. పిలిచినా.. చివ‌రి నిముషంలో స‌మాచారం ఇచ్చారు.

దీనిపై తిప్పేస్వామి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్‌ అశోక్ కుమార్‌కు లేఖ రాశారు. దురు ద్దేశంతోనే సమావేశానికి తాను రాకుండా చేశార‌ని, ఎస్సీనైన‌న్ను ప‌ట్టించుకోక‌పోవ‌డం మ‌న‌సును గాయ‌ప‌రిచింద‌ని పేర్కొన్నారు. దళిత వర్గానికి ఎలాంటి సందేశాన్ని పంపించాలని అనుకున్నారో చెప్పండని ప్రశ్నించారు. ఇది దళితులని అవమానించడం కాదా..! ఎన్నికల సమయంలో ఇది పార్టీకి నష్టం కలిగించదా అని తిప్పేస్వామి నిల‌దీశౄరు. దళితలైన మేము ఎంత పెద్ద పదవిలో ఉన్నా అవమానం భరించడం సహజమే అని వ్యాఖ్యానించారు.