బిహార్‌లో కుప్ప‌కూలిన ప్ర‌భుత్వం.. నితీష్ రాజీనామా

అంద‌రూ అనుకున్న‌ట్టుగానే.. లెక్క‌లు ప‌క్కాగా స‌రిపోవ‌డంతో బిహార్ రాజ‌కీయం ఒక్క‌సారిగా మ‌లుపు తిరిగింది. ప్ర‌స్తుత సీఎం, జ‌న‌తాద‌ళ్ యునైటెడ్‌(జేడీయూ) నేత నితీశ్ కుమార్ త‌న ప‌దవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖ‌ను స్వ‌యంగా ఆయ‌న ప‌ట్నాలోని రాజ్‌భ‌వన్‌కు వెళ్లి గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర అర్లేక‌ర్‌కు అందించారు. త‌న రాజీనామా ప‌త్రంలో నితీశ్ ఎలాంటి కార‌ణాల‌ను పేర్కొన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఈ రాజీనామాను ఆగ‌మేఘాల‌పై ఆమోదించేసిన గ‌వ‌ర్న‌ర్‌.. తాత్కాలిక‌ ముఖ్య‌మంత్రిగాకొన‌సాగాల‌ని కోరారు.

వాస్త‌వానికి బిహార్‌లో గ‌త వారం రోజుల నుంచి రాజ‌కీయాలు మారిపోయాయి. సీఎం నితీష్‌కుమార్‌.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తార‌నే చ‌ర్చ జోరుగా సాగింది. ఇప్పుడు.. రేపు.. సాయంత్రం అంటూ.. పెద్ద ఎత్తున జాతీయ మీడియాలోనూ క‌థ‌నాలు హాట్‌హాట్‌గా సాగాయి. అయితే.. తొలుత అలాంటి దేమీ లేద‌ని చెప్పిన నితీశ్‌.. త‌ర్వాత‌.. స‌డెన్‌గా ఆయ‌న ఆదివారం ఉద‌యం నేరుగా రాజ్‌భ‌వ‌న్ బాట ప‌ట్టారు. ప్ర‌స్తుతం బిహార్‌లో మ‌హాఘ‌ట్‌బంధ‌న్ స‌ర్కారు న‌డుస్తోంది.

లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీతోనూ జ‌ట్టుక‌ట్టిన నితీశ్‌.. ప్ర‌బుత్వాన్ని ఏర్పా టు చేశారు. అయితే.. ఇది కూడా 2022 నుంచే. దీనికి ముందు 2021లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో నితీశ్ బీజేపీతో క‌లిసి ఉన్నారు. అప్ప‌ట్లో బీజేపీ కూట‌మి స‌ర్కారునే ఏర్పాటు చేశారు. అయితే.. సీఎం సీటుకు ఎస‌రు పెడుతున్నార‌ని గ‌మ‌నించిన నితీశ్ .. బీజేపీతో రాత్రికి రాత్రి క‌టీఫ్ చెప్పి.. ఆర్జేడీతో చేతులు క‌లిపారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ విభేదించారు. మ‌ళ్లీ క‌లిశారు. ఇక‌, ఇప్పుడు మ‌రోసారి విడిపోయారు.

మొత్తంగా 2021లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు నితీశ్ త‌న ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం.. రెండు సార్లు కూల్చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుత ప‌రిణామాల‌కు కార‌ణం.. కాంగ్రెస్‌తో ఇమ‌డ‌లేక‌పోవ‌డం.. ప్ర‌ధాని సీటును ఆయ‌న‌కు ఇండియా కూట‌మి ఇవ్వ‌లేక పోవ‌డం.. మ‌రోవైపు మోడీ ప్రభ‌జనం మ‌రింత పెరిగింద‌నే అంచ‌నా.. దీనికి తోడు.. జ‌న నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న క‌ర్పూరీ ఠాకూర్‌కు భార‌తరత్న ఇవ్వ‌డం వంటివి కార‌ణాలు.