కాంగ్రెస్ లోకి తీగల

Theegala Krishna Reddy To Join Congresds

మాజీ ఎంఎల్ఏ, బీఆర్ఎస్ సీనియర్ నేత తీగల కృష్ణారెడ్డి తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఆయనతో పాటు రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ అనితారెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. నిజానికి వీళ్ళిద్దరు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరాల్సింది. అయితే వివిధ కారణాలతో అప్పట్లో జాయినింగుకు బ్రేక్ పడింది.  తాజాగా అంటే శనివారం రేవంత్ రెడ్డితో తీగల భేటీ అయ్యారు. దాంతో మామ, కోడళ్ళు కాంగ్రెస్ లో చేరటం ఖాయమని అర్ధమైంది.

విషయం ఏమిటంటే తీగలకు మహేశ్వరం బీఆర్ఎస్ ఎంఎల్ఏ సబితా ఇంద్రారెడ్డికి ఏమాత్రం పడదు. అందుకనే అడుగడుగునా తీగలను సబిత అడ్డుకుంటున్నారట. కేసీయార్ కూడా సబితకే బాగా ప్రధాన్యత ఇస్తుండటంతో తీగల పార్టీలో బాగా ఇబ్బంది పడుతున్నారు. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ అనితారెడ్డికి కూడా పార్టీలో పరిస్ధితులు ఇబ్బందిగానే ఉన్నాయట. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నరోజుల్లో కూడా అనిత చాలా సమస్యలను ఎదుర్కొన్నారట. సబితతో ఇబ్బందుల వల్లే మామ, కోడళ్ళు పార్టీలో ఉండలేని పరిస్ధితులు పెరిగిపోయాయి.

అందుకనే పార్టీ మారాలని అనుకున్నా ఎందుకనో అప్పట్లో కుదరలేదు. అలాంటిది తొందరలోనే ముహూర్తం చూసుకుని కారు దిగేస్తారనే ప్రచారం బాగా జోరందుకున్నది. తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ళ నియోజకవర్గంలో పోటీచేయాలని తీగల కృష్ణారెడ్డి ప్రయత్నిస్తున్నారు. అదే విషయాన్ని రేవంత్ తో చెప్పారట. అయితే నియోజకవర్గాల్లో జరుగుతున్న సర్వే ఆధారంగానే టికెట్ల ఎంపిక ఉంటుందని చెప్పారట. అలాగే అనితారెడ్డినే జడ్పీ ఛైర్ పర్సన్ గా కంటిన్యు చేసే విషయంలో మాత్రం రేవంత్ హామీ ఇచ్చినట్లు పార్టీవర్గాల టాక్.

తీగల గనుక పార్టీ మారితే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చేవెళ్ళ నియోజకవర్గం పరిధిలో కొంచెం ఇబ్బందనే చెప్పాలి. ఇపుడు కాంగ్రెస్ లోకి రాబోతోంది తీగలే అయినప్పటికీ తొందరలోనే ఇంకెంతమంది జాయినవ్వటానికి రెడీ అవుతున్నారో తెలీదు. కాంగ్రెస్, టీడీపీల నుండి బీఆర్ఎస్ లోకి ఒకపుడు నేతలు ఎలా వలస వెళ్ళారో అదేపద్దతిలో కారు పార్టీలో నుండి కాంగ్రెస్ లోకి నేతలు వచ్చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లోపు ఎంతమంది నేతలు బీఆర్ఎస్ ను వదిలేస్తారో చూడాలి.