ఈసారి తెలంగాణ‌కే ప‌రిమితం.. కేసీఆర్ నిర్ణ‌యం

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. తాజాగా ఎర్ర‌వ‌ల్లిలోని ఫామ్ హౌస్‌లో ఆయ‌న పార్టీ కీల‌క నేత‌లు, పార్ల‌మెంటు స‌భ్యుల‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు మాసాలుగా ఇంటి నుంచి బ‌య‌ట కు రాని కేసీఆర్‌.. పార్ల‌మెంటు ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డం.. మ‌రికొద్ది రోజుల్లోనే ఎన్నిక‌ల‌నోటిఫికేష‌న్ వ‌చ్చేందుకు రంగం కూడా రెడీ అవుతున్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో ఏవిధంగా పోరు సాగిద్దామ‌నే విష‌యంపై ఆయ‌న తాజాగా ఈ భేటీ ఏర్పాటు చేశారు. దీనిలో కేటీఆర్‌, హ‌రీష్‌రావు, నామా నాగేశ్వ‌ర‌రావు, క‌విత త‌దితర ముఖ్య నేత‌లు పాల్గొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీలుపుంజుకున్న నేప‌థ్యంలో పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేందు కు అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై కేసీఆర్ చ‌ర్చించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉచిత బ‌స్సు స‌ర్వీసులు అందుబాటులోకి తెచ్చిన నేప‌థ్యంలో మ‌హిళా ఓటు బ్యాంకు ప‌రిస్థితిని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కేడ‌ర్ ప‌రిస్థితి, క్షేత్ర‌స్థాయిలో బీఆర్ ఎస్ పార్టీ అనుకూల‌.. ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను కూడా ఆయ‌న తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దిశానిర్దేశం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ పార్టీని కేవ‌లం తెలంగాణ‌కే ప‌రిమితం చేయాల‌ని నిర్ణ‌యించారు.

వాస్త‌వానికి వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఇత‌ర పార్టీల‌ను కూడ‌గ‌ట్టి.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై యుద్ధం చేయాల‌ని కేసీఆర్ భావించారు. అయితే.. తెలంగాణ‌లో ఓడిపోవ‌డం..త‌న‌కు అనారోగ్యం.. కేంద్రంలో బీజేపీ బ‌లంగా ఉండ‌డం వంటి ప‌లు కార‌ణాల‌తో కేసీఆర్ ఈ ద‌ఫా ఎన్నిక‌ల‌కు కేవ‌లం తెలంగాణ‌కే ప‌రిమితం కావాల‌ని.. 16(1ఎంఐఎం) పార్ల‌మెంటు స్థానాల్లో క‌నీసం 12 నుంచి 15 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకునేలా వ్యూహాలు ఉండాల‌ని కేసీఆర్ దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలిసింది. అవ‌స‌ర‌మైతే.. మ‌రిన్ని ప‌థ‌కాలుప్ర‌క‌టించ‌డం ద్వారా.. మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకునేదిశ‌గా అడుగులు వేయాల‌ని సూచించారు.

రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు జోష్‌లో ఉండడం, జాతీయ విధానాలపై జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ అంశాలతో ఎన్నికలకు వెళ్లాలన్న అంశంపై చర్చకు వచ్చింది. ప్ర‌ధానంగా రామమందిర ఎఫెక్ట్ బీజేపీకి ఏ విధంగా క‌లిసి వ‌స్తుంది..? దీనిని రాష్ట్రంలో ఎలా ఎదుర్కొనాల‌నే విష‌యాల‌పైనా కేసీఆర్ దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది. ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేవ‌లం తెలంగాణ‌కే ప‌రిమితం కావాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం గ‌మ‌నార్హం.