బైరెడ్డికి లైన్ క్లియరైందా ?

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సీనియర్ నేతల్లో ఒకరైన బైరెడ్డి రాజశేఖరరెడ్డికి లైన్ క్లియర్ అయినట్లే ఉంది. తొందరలోనే అంటే ఈనెలాఖరులోపు లేదా వచ్చేనెలలో తెలుగుదేశంపార్టీలో చేరటం ఖాయమని పార్టీవర్గాల సమాచారం. తొందరలోనే జరగబోయే ఎన్నికల్లో నంద్యాల నుండి లోక్ సభకు బైరెడ్డి పోటీచేసే అవకాశముందని అంటున్నారు. ఆయన కూతురు శబరిని కూడా అసెంబ్లీకి పోటీచేయించాలని బైరెడ్డి పట్టుబడుతున్నారట. అయితే ఈ విషయమై ఇంకా క్లారిటిరాలేదు. కూతురు పోటీచేసే విషయాన్ని పక్కనపెట్టేసినా బైరెడ్డి కుటుంబం టీడీపీలో చేరటం దాదాపు ఖాయమనే అంటున్నారు.

బైరెడ్డి 1994,99లో నందికొట్కూరు నుండి ఎంఎల్ఏగా రెండుసార్లు గెలిచారు. 2004లో ఓడిపోయిన తర్వాత 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగింది. దాంతో నందికొట్కూరు నుండి పాణ్యంకు మారారు. అప్పటినుండి ఒకటిరెండుసార్లు పోటీచేసినా గెలవలేదు. టీడీపీని వదిలేసి రాయలసీమ జలాలంటు సామాజిక ఉద్యమాల్లో కొంతకాలం బిజీ అయిపోయారు. ముందు కాంగ్రెస్ తర్వాత టీడీపీ ఆ తర్వాత బీజేపీ మళ్ళీ టీడీపీలో చేరారు. మధ్యలో వైసీపీలో కూడా చేరటానికి ప్రయత్నించినా సాధ్యంకాలేదు.

తొందరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేయాలన్నది బైరెడ్డి కోరిక. అందుకనే చంద్రబాబునాయుడుతో మంతనాలు అన్నీ అయిపోయాయట. కూతురుకు టికెట్ విషయమే ఇంకా తేలలేదట. నంద్యాలలో తాను పోటీచేయటంతో పాటు నందికొట్కూరు, పాణ్యం అసెంబ్లీల్లో టికెట్లు కూడా తనవాళ్ళకే ఇవ్వాలని బైరెడ్డి గట్టిగా పట్టుపడుతున్నట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. నందికొట్కూరులో తన మద్దతుదారులతో బైరెడ్డి సమావేశం నిర్వహించారు. తాను టీడీపీ తరపున ఎంపీగా పోటీచేయబోతున్నట్లు చెప్పారట.

ఇపుడు విషయం ఏమిటంటే బైరెడ్డి టీడీపీలో చేరితే ఇప్పటివరకు పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న మాండ్ర శివానందరెడ్డి, పాణ్యం, నందికొట్కూరు ఇన్చార్జిలుగా ఉన్న దంపతులు గౌరు వెంకట్రెడ్డి, గౌరు చరితారెడ్డి పరిస్ధితి ఏమిటన్నది తేలటంలేదు. పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే చరితకు ఎంఎల్సీ ఇచ్చేట్లు, మాండ్రను రాజ్యసభకు పంపటానికి చంద్రబాబు హామీ ఇచ్చారట. అందరు తమ్ముళ్ళు కలిసికట్టుగా పనిచేస్తే నంద్యాల ఎంపీ సీటుతో పాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోను గెలుపుఖాయమని అనుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.