రాజ్య‌స‌భ ఎల‌క్ష‌న్స్‌: వైసీపీ ప‌క్కా స్కెచ్‌.. టీడీపీకి షాక్‌

మ‌రికొద్ది వారాల్లోనే ఏపీలో రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రెండు స్థానాల‌కు సంబంధించి ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. ప్ర‌స్తుతం ఏపీలో నెల‌కొన్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ రెండింటిలో ఒక‌టి త‌న‌వైపు మ‌ళ్లించుకునేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వైసీపీ నుంచి త‌మ‌కు అనుకూలంగా మారిన ఎమ్మెల్యేల‌ను వినియోగించుకుని ఒక సీటును ప్ర‌భావం చేసే అవ‌కాశంపై టీడీపీ కొన్నాళ్లుగా దృష్టి పెట్టింది. గ‌తంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ పంచుమ‌ర్తి అనురాధ‌ను టీడీపీ ఇలానే గెలిపించుకుంది.

ఈ నేప‌థ్యంలో టీడీపీ వ్యూహాన్ని ముందుగానే ప‌సిగ‌ట్టిన వైసీపీ తాజాగా భారీషాక్ ఇచ్చింది. టీడీపీ టికెట్పై గ‌త ఎన్నికల్లో విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న గంటా శ్రీనివాస‌రావుపై తాజాగా అసెంబ్లీ స్పీక‌ర్ వేటు వేశారు. ఆయ‌న గ‌తంలో విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీని ప్రైవేటీక‌రించే నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా చేసిన రాజీనామాను తాజాగా ఆమోదించిన‌ట్టు స్పీక‌ర్ కార్యాల‌యం తెలిపింది. నిజానికి 2022, ఫిబ్ర‌వ‌రిలోనే గంటా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అప్ప‌టి నుంచి తాత్సారం చేసిన స్పీక‌ర్‌.. ఇప్పుడు కీల‌క‌మైన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల ముందు ఆమోదించ‌డం వెనుక అధికార పార్టీ వ్యూహం ఉంద‌నే చ‌ర్చ సాగుతోంది.

మ‌రోవైపు.. స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం మ‌రో నిర్ణ‌యం కూడా తీసుకున్నారు. టీడీపీ లో గెలిచి.. వైసీపీ బాట ప‌ట్టిన ఎమ్మెల్యేలు.. వల్లభనేని వంశీ(గ‌న్న‌వ‌రం), కరణం బలరాం(చీరాల‌), వాసుపల్లి గణేష్(విశాఖ ద‌క్షిణ‌), మ‌ద్దాలి గిరి(గుంటూరు వెస్ట్), రాపాక వరప్రసాద్(జ‌న‌సేన‌-రాజోలు)లతో పాటు వైసీపీ నుంచి సస్పెండ్ అయి, టీడీపీలో చేరిన‌ మేకపాటి శేఖర్ రెడ్డి, ఉండ‌వ‌ల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలకు సైతం నోటీస్ లు జారీ చేశారు. పార్టీ మార్పు పై వారం లోపు సమాధానం చెప్పాలని లేదంటే అనర్హత వేటు వేస్తామని నోటీసుల‌లో స్ప‌ష్టం చేశారు.