మోడీ క‌న్నీటి ప‌ర్యంతం.. చిన్న‌నాటి సంగ‌తులు గుర్తు చేసుకుని!

ఎప్పుడూ గంభీరంగా క‌నిపించే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ఈ రోజు నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. అయితే.. క‌న్నీళ్ల‌ను ఆపుకుని.. గ‌ద్గ‌ద స్వ‌రంతో ఆయ‌న ప్ర‌సంగించారు. దీనికి కార‌ణం.. చిన్న‌నాటి సంగ‌తులు.. త‌మ కుటుంబం క‌ష్టాలు ఆయ‌న క‌ళ్ల‌ముందు క‌ద‌లాడ‌డ‌మే. గుర్తుకు రావ‌డ‌మే. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మ‌హారాష్ట్ర‌లోని షోలాపూర్‌లో ప‌ర్య‌టించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న కింద‌.. దేశంలోనే అతి పెద్ద సొసైటీగా నిర్మించిన భారీ సంఖ్య‌లో ఇళ్ల‌ను ప్రారంభించారు. అధునాత‌న సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని వ‌స‌తుల‌తో నిర్మించిన ఈ భ‌వ‌నాలు.. దేశంలో కేంద్ర ప్ర‌భుత్వం నిర్మిస్తున్న ఇళ్ల‌లో తొలిస్థానంలో ఉన్నాయి. వీటిని ప్రారంభిం చిన అనంత‌రం.. మోడీ ప్ర‌సంగిస్తూ… మీరు ఇప్పుడు అదృష్ట‌వంతులు. అన్ని వ‌స‌తులు.. సౌక‌ర్యాలు, అధునాత‌న నిర్మాణాల‌తో కూడిన ఇళ్ల‌ను సొంతం చేసుకున్నారు అని వ్యాఖ్యానించారు.

ఇదేస‌మ‌యంలో త‌న బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ.. “నా చిన్న‌ప్పుడు ఇలాంటి ఇళ్ల‌లో ఉండే అవ‌కాశం మాకు రాలేదు. చిన్న ఇంట్లోనే అంద‌రం కాళ్లు ముడుచుకుని ఉండే వాళ్లం.. ” అంటూ.. ఒక్క‌సారిగా క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ప‌క్క‌నే గ్లాసులో ఉన్న మంచినీళ్లు తాగి.. కొన్ని సెక‌న్ల‌పాటు త‌న ప్ర‌సంగాన్ని ఆపేశారు. అనంత‌రం తేరుకున్నా.. మోడీ గొంతులో బాధ స్పష్టంగా వినిపించింది. గద్గ‌ద స్వరంతోనే ఆయ‌న మాట్లాడారు. నేడు త‌మ ప్ర‌భుత్వం పేద‌ల‌కు అధునాతన ఇళ్ల‌ను నిర్మించి ఇస్తోంద‌ని చెప్పారు.

పేద‌ల‌కు మేలు చేయాల‌న్న సంకల్పంతో అయోధ్య రాముడిని ఆద‌ర్శంగా తీసుకుని త‌మ ప్ర‌భుత్వం నిజాయితీగా ప‌నిచేస్తోంద‌ని మోడీ చెప్పారు. ఈ నెల 22న జ‌ర‌గ‌నున్న అయోధ్య రాముని ప్ర‌తిష్టా కార్య‌క్ర‌మాన్నిపుర‌స్క‌రించుకుని ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఇళ్ల‌లో శ్రీరామ జ్యోతిని వెలిగించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ప్ర‌తి ఒక్క‌రూ రాముడు చూపిన బాట‌లో న‌డ‌వాల‌న్న‌దే త‌మ ఉద్దేశ‌మ‌ని వెల్ల‌డించారు.