ఈటల పోటి ఇక్కడి నుండేనా ?

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారా ? తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ఎందుకంటే మల్కాజ్ గిరి స్ధానం నుండి పోటీచేస్తానని ఈటల పార్టీ అగ్రనేతలను అడిగారు. ఈ విషయాన్ని ఈటలే స్వయంగా చెప్పారు. తనకు కరీంనగర్ పార్లమెంటుకు పోటీచేయాలని బలంగా ఉందట. ఎందుకంటే కరీంనగర్ జనాలతో తనకు ప్రత్యేక అనుబంధముందట. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉన్న విషయాన్ని గుర్తుచేశారు.

సిట్టింగ్ ఎంపీగా బండి ఉన్నందున తాను ఇక్కడ పోటీచేయటం లేదట. అందుకనే మల్కాజ్ గిరి పార్లమెంటులో పోటీచేయటానికి టికెట్ కావాలని అధిష్టానాన్ని అడిగినట్లు చెప్పారు. అయితే తనను ఎక్కడినుండి పోటీచేయించాలన్నది పూర్తిగా అధిష్టానం ఇష్టమే అన్నారు. అగ్రనేతలు ఎక్కడి నుండి పోటీచేయమంటే అక్కడి నుండే పోటీచేస్తానని ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సిట్టింగ్ ఎంపీలు నలుగురిని మళ్ళీ వాళ్ళ స్ధానాల నుండే పోటీచేయించాలని ఇప్పటికే అగ్రనేతలు డిసైడ్ అయ్యారు. అందుకనే ఆదిలాబాద్ లో సోయం బాబూరావు, కరీంనగర్లో బండి సంజయ్, నిజామాబాద్ లో ధర్మపురి అర్వింద్, సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి పోటీచేయటానికే అవకాశం ఎక్కడుంది.

ఏ కారణం వల్లయినా వీళ్ళు మార్పును కోరుకుంటే అప్పుడు కొత్తవారికి ఛాన్సుంటుంది. వీళ్ళ నలుగురిని తీసేసిన తర్వాత ఇంకా 13 పార్లమెంటు నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులు కావాల్సుంటుంది. మల్కాజ్ గిరి, జహీరాబాద్ లాంటి స్ధానాలకు సీనియర్ల నుండి, బయట వ్యక్తుల నుండి కూడా గట్టిపోటీయే ఉంది.

ఎలా తీసుకున్నా కనీసం తక్కువలో తక్కువ 10 సీట్లలో గట్టి అభ్యర్ధులు చాలా అవసరం. అయితే జాతీయ నాయకత్వం కోరుకంటున్నట్లు అన్నీ సీట్లలో గట్టి అభ్యర్ధులు దొరకటం కష్టమే. ఎందుకంటే ఇపుడున్న నలుగురు ఎంపీల్లో కూడా ఎంతమంది గెలుస్తారన్నది అనుమానంగానే ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుండి కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో సానుకూల స్పందన కనబడుతోంది. కాబట్టి 17 ఎంపీ నియోజకవర్గాల్లో అత్యధిక స్ధానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులే గెలిచే అవకాశాలున్నాయని అర్ధమవుతోంది. మరి బీజేపీ వ్యూహాలన్నీ ఏమవుతాయో చూడాలి.