కాంగ్రెస్ కి పెద్ద షాకే ఇది

తెలంగాణాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై మొదటి షాక్ ఇచ్చారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన రెండు ఎంఎల్సీ స్ధానాల భర్తీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అయ్యింది. భర్తీ చేయాల్సిన రెండుపేర్లపై రేవంత్ పెద్ద కసరత్తే చేస్తున్నారు. ఇదే విషయమై పార్టీలోని కొందరు సీనియర్లతో పాటు అధిష్టానంతో కూడా చర్చలు జరిపారు. ఒకటిరెండు రోజుల్లో ఎంపిక కూడా అయిపోవాలని అనుకుంటున్నారు రేవంత్.

సరిగ్గా ఇలాంటి సమయంలో గవర్నర్ కోటా భర్తీకి రాజ్ భవన్ రెడ్ సిగ్నల్ చూపించింది. కోర్టులో కేసు విచారణలో ఉన్న కారణంగా రెండసీట్లను భర్తీ చేయటం సాధ్యంకాదని గవర్నర్ తమిళిసై ముఖ్యమంత్రికి కబురుచేశారు. కేసీయార్ పాలనలో ఈ రెండుస్ధానాల భర్తీ కోసం గవర్నర్ కు సిఫారసు చేశారు. ఏదైనా రంగాల్లో నిపుణులను రెండు స్ధానాల్లో భర్తీ చేయాల్సుంటుంది. అయితే ఇపుడు ఆ వృత్తులు, నిపుణులు అన్నదంతా పక్కకుపోయింది. భర్తీ అవుతున్నదంతా అచ్చంగా రాజకీయ కారణాలు, నేతలతోనే అని అందరికీ తెలిసిందే.

అదే పద్దతిలో కేసీయార్ హయాంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ అనే నేతలను సిఫారసు చేశారు. అయితే గవర్నర్ ఆ ఫైలును పెండింగులో పెట్టేశారు. కేసీయార్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా గవర్నర్ మాత్రం ఫైలుపై సంతకం చేయలేదు. దాంతో ఏమి చేయలేక కేసీయార్ ఆ ఫైలును పక్కనపడేశారు. దాంతో అప్పటినుండి ఆ రెండుస్ధానాలు భర్తీ కాకుండా అలాగే ఆగిపోయింది.

పెండింగులో ఉన్న రెండుస్ధానాలను భర్తీచేసే అవకాశం ఇపుడు తమకు వచ్చిందని రేవంత్ రెడ్డితో పాటు అందరు అనుకున్నారు. అందుకనే హడావుడిగా కసరత్తు కూడా మొదలుపెట్టేశారు. తీరా ఇపుడు రాజ్ భవన్ ఏమో మొత్తం కసరత్తును ఆపేయాలన్నట్లుగా సమాచారం ఇచ్చింది. ఎందుకంటే కేసీయార్ హయాంలోనే ఎంఎల్సీల ఫైలుపై గవర్నర్ సంతకం చేయకపోవటాన్ని చాలెంజ్ చేస్తు కోర్టులో కేసు దాఖలు చేశారు. ఆ కేసు ఇంకా పెండింగులోనే ఉంది. కోర్టులో కేసు క్లియర్ అయితే తప్ప గవర్నర్ కోటాను భర్తీ చేసేందుకు లేదని చల్లగా చెప్పారు.