ఏపీ నేతలంతా అపోలోకు పొలోమంటున్నారే?

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. రోజుకు 10 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం కలవరపెడుతోంది. తాజాగా గురువారం నాడు కూడా 10,199 పాజిటివ్ కేసులు రావడంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 4,65,730కి చేరుకుంది.

సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు….పల్లెల నుంచి పట్టణాల వరకు చాలామంది కరోనా బారిన పడుతున్నారు. అయితే, కరోనా బారిన పడిన సామాన్యులు ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తుండగా…రాజకీయ నేతలు మాత్రం హైదరాబాద్ లోని అపోలోలో చికిత్స పొందేందుకు క్యూ కడుతున్నారు.

ఏపీలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతూ భరోసానివ్వవలసిన రాజకీయ నేతలే…పొరుగు రాష్ట్రానికి వెళ్లడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.అందులోనూ ప్రత్యేకించి అపోలోలో ఎందుకు చేరుతున్నారన్న చర్చ మొదలైంది.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, శాసనమండలి చైర్మన్ షరీఫ్, ఎంపీ విజయసాయి రెడ్డి, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్ర రెడ్డి లాంటి ప్రముఖులంతా కరోనా బారిన పడి చికిత్స కోసం హైదరాబాదు అపోలో ఆసుపత్రిని ఆశ్రయించారు.

ఏపీలో ఆసుపత్రుల్లో చికిత్స బ్రహ్మాండంగా ఉందని చెబుతున్న అధికార పార్టీ నాయకులు సైతం…పొలోమని అపోలోకు పోవడం చర్చనీయాంశమైంది. ఏపీలోని ఆసుపత్రులపై అంత అపనమ్మకమో….తెలంగాణలోని అపోలో మీద అంత నమ్మకమో..కారణమేదైనా….అపోలోకు క్యూ కడుతున్న నేతల సంఖ్య పెరగడంపై విమర్శలు వస్తున్నాయి.

దీంతో, ఏపీలోని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఏపీలో సరైన చికిత్స అందడం లేదన్న సంకేతాలిచ్చేలా వ్యవహరిస్తున్న నేతల తీరు….ప్రజల నైతిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని దెబ్బతీస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై జగన్ ఫోకస్ చేసి ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.